'నేను చనిపోవడం ఖాయం.. అయితే నన్ను చూడటానికి రావొద్దు'
తెలుగు తెరపై ఉన్నంత మంది కమెడియన్లు భారతదేశంలోని ఏ చిత్ర పరిశ్రమలోనూ లేరు. నాటి కస్తూరి శివరామ్ నుంచి నేటి సప్తగిరి వరకు ఎందరో హాస్యనటులు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఇక్కడి కమెడియన్లకు ఉందంటే అతిశయోక్తి కాదు, కొన్నిసార్లు బడా హీరోలే చేతులెత్తేస్తే హాస్యనటులు సినిమాను తమ భుజాలపై వేసుకుని మోశారు. పుష్పక విమానంలో ఎంత మంది ఎక్కినా ఒకరికి చోటు ఉంటుందన్నట్లు ఎంతమంది కమెడియన్లు వచ్చినా తెలుగు హాస్య కుటుంబంలో ప్లేస్ ఖాయం.
కామెడీకి స్టార్ డమ్ తెచ్చిన దర్శకులు.. కామెడీనే హీరోని చేసిన మేకర్స్ తెలుగు సినిమా సొంతం. యాక్షన్ , సస్పెన్స్, క్రైమ్ మూవీస్ రాజ్యమేలుతున్నప్పటికీ.. కనీసం ఒక్క కామెడీ సీన్నైనా దర్శకులు చొప్పిస్తున్నారంటే మనవాళ్లు హాస్యానికి ఇచ్చే ప్రాధాన్యత అర్ధం చేసుకోవచ్చు. టాలీవుడ్లో ఇంత మంది కమెడియన్లు ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు అభిమానం చాటుకున్నారు తప్పించి.. ఎలాంటి ఈగోలకు వెళ్లక మన హాస్య కుటుంబం గొప్పదనం.

తెలుగు కమెడియన్లలో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. పంచ్లు , ప్రాసలు, టైమింగ్తో ప్రేక్షకులను నవ్వించడంలో ఎవరికి వారే సాటి. ఈ జనరేషన్లో బ్రహ్మానందం కామెడీ కింగ్గా స్టార్ స్టేటస్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆయనకు ముందు, ఆయన తర్వాత ఎంతోమంది కమెడియన్లు వచ్చినా బ్రహ్మానందం స్థాయి వేరు. అహనా పెళ్లంట నుంచి కల్కి 2898 ఏడీ వరకు 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి తెలుగు సినిమాకి ఖ్యాతిని తెచ్చిపెట్టారు.
వయసు పైబడినా, ఎంతమంది కొత్త హాస్యనటులు వస్తున్నా బ్రహ్మానందం.. బ్రహ్మానందమే. తెరపై ఆయన కనిపిస్తే చాలు తెలియకుండా పెదవులపై నవ్వు ఆగదు. కెరీర్లో ఎంతోమంది హీరోలు, కమెడియన్లతో కలిసి నటించారు బ్రహ్మీ. వారిలో ధర్మవరపు సుబ్రమణ్యంతో ఆయన ఎక్కువ క్లోజ్గా ఉండేవారు. ఎంతలా అంటే ఇండస్ట్రీలో బ్రహ్మానందాన్ని ఏరా, పోరా అని పిలిచే ఏకైక వ్యక్తి ధర్మవరపు సుబ్రమణ్యం ఒక్కరే. అలాంటిది బ్రహ్మానందాన్ని తనను చూడటానికి రావొద్దన్నారట సుబ్రమణ్యం.
ధర్మవరపు చనిపోయినప్పుడు ఆయనను గుర్తుచేసుకుంటూ బ్రహ్మానందం ఈ విషయాన్ని చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ధర్మవరాన్ని తాను ధర్మన్న అని పిలిచేవాడినని.. చనిపోవడానికి కొద్దిరోజుల ముందు వాడు తనకు ఫోన్ చేసి చిన్న రిక్వెస్ట్ రా .. నువ్వు నన్ను చూడటానికి రావొద్దురా, నువ్వు నన్ను అలా చూడలేవు..గతంలో నువ్వు చూసినట్లు ఇప్పుడు నేను లేనని తనతో అన్నాడని బ్రహ్మానందం చెప్పారు. నీ గుర్తుల్లో నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి.. అందుకే నన్ను చూడటానికి రావొద్దు రా అని రిక్వెస్ట్ చేశాడని చెప్పుకొచ్చారు.
కానీ తాను ప్రతిరోజూ సుబ్రమణ్యాన్ని చూడాలని ట్రై చేసేవాడినని.. కానీ వాడు ఆపేవాడని, డిసెంబర్ నెలలో వద్దువు గానీ అప్పటికీ తాను కోలుకుంటానని చెప్పేవాడని బ్రహ్మానందం తెలిపారు. తన కోసం ఓ పద్యం పాడి.. త్వరలోనే వచ్చేస్తానని, మళ్లీ అందరం కలిసి నటిద్దామని చెప్పాడని.. కానీ అంటూ బ్రహ్మానందం కళ్ల నిండా నీటితో ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి అనుబంధాన్ని చూసి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 2013 డిసెంబర్ 7న లివర్ క్యాన్సర్తో ధర్మవరపు సుబ్రమణ్యం కన్నుమూసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











