’బాహుబలి మూవీతో నా కెరీర్ నాశనం.. అలా చాలా నష్టపోయా‘
విభిన్న పాత్రలు పోషించి తెలుగు ఆడియెన్స్ కు ఎంతో దగ్గరయ్యారు నటుడు సుబ్బరాజు. ఆయన పూర్తి పేరు పెనుమత్స సుబ్బరాజు. సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఆయన 2003లో శ్రీకాంత్ 'ఖడ్గం' సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. విలన్ పాత్రలు పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ - పూరీ కాంబోలోని 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంలో నెగెటివ్ లో నటించి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందకుపైగా సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుబ్బరాజు బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఆర్య, పోకిరి, స్టాలిన్, యోగి, తులసి, బిల్లా, నమో వెంకటేశా, దూకుడు, ఇద్దరమ్మాయిలతో, మిర్చి, టెంపర్, శ్రీమంతుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయనకున్న క్రేజ్ తో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళినే 'బాహుబలి 2 : ది కన్ క్ల్యూజన్' చిత్రంలో అవకాశం ఇచ్చారు. కామెడీ, వీరుడిగా మిళితమైన కుమారవర్మ పాత్రలో సుబ్బరాజు అలరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సుబ్బరాజుకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.

కానీ.. ఎంత ఫేమ్ దక్కిందో అంతే నష్టం కూడా భరించాల్సి వచ్చిందని సుబ్బరాజు తన ఇంటర్వ్యూలో బాంబు పేల్చాడు. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి వల్ల తన కెరీర్ లో చాలా కోల్పోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు... బాహుబలికి కమిట్ అయ్యాక... తనకు ఆ టైమ్ లో బ్లాక్ బాస్టర్ చిత్రాల నుంచి మంచి రోల్స్ లో నటించే అవకాశం వచ్చిందన్నారు. ఎన్నో పెద్ద ప్రాజెక్ట్స్ నుంచి అవకాశాలు వచ్చినా.. బాహుబలికి ఒప్పుకోవడంతో ఆ చిత్రాలను మిస్ చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కానీ ఆ చిత్రంతో ఎంతో ఫేమ్ వచ్చిందని తెలిపారు.
ఇక ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటించడమంటే అంతఈజీ కాదని వివరించారు. చాలా త్యాగాలు కూడా చేయాల్సి వస్తుందని చెప్పారు. ఇక జక్కన్న పెద్ద హీరోలనే పర్ఫెక్షన్ అని బెస్ట్ అవుట్ పుట్ కోసం ఎంతలా పిండేస్తారో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిపై చేసిన ఫన్నీ కామెంట్లు వింటే జక్కన్న వర్క్ విషయంలో ఎంత కచ్చితత్వంగా ఉంటారో తెలుస్తుంది. అంతే ఫలితాన్ని కూడా అందిస్తారు. ఇక అదే విషయాన్ని సుబ్బరాజు కూడా మరోసారి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో నటించిన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు.
జక్కన్న తో సినిమాలు తీసిన తర్వాత స్టార్స్ కు కూడా ఆ స్థాయి హిట్లు పడటం చాలా కష్టమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క హీరో కూడా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయలేకపోయారు. ఇక సుబ్బరాజు లాంటి వారి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదేమైనా మన రాజమౌళి తెలుగు సినిమా సత్తాను ప్రపంచం మొత్తం చాటుతున్నారు. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత.. ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఎస్ఎస్ఎంబీ29ను తెరకెక్కిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్ర షూటింగ్ జోరుగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











