19 ఏళ్లకే పెళ్లి, విడాకులు.. పిల్లలతో రోడ్డుపైకి.. సింగర్ సునీత గురించి ఇవి తెలుసా?
గాన గంధర్వుడు , దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దశాబ్ధాల పాటు నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంపై ఓ యువ సింగర్ చేసిన ఆరోపణలు ఆ షోకు మచ్చగా మారాయి. జడ్జిలుగా ఉన్న కీరవాణి, చంద్రబోస్, సునీత తనను అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ ప్రవస్తి అనే సింగర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీనికి తోడి సింగర్లు, సినీ ప్రముఖులు ఆమెకు కౌంటర్ ఇవ్వడం స్వయంగా సింగర్ సునీత వీడియో రిలీజ్ చేసి మండిపడటంతో ఇది కాస్తా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో సునీత మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆమె నేపథ్యం? సింగర్గా అవకాశాలు? మొదటి భర్తతో విడాకులు? రెండో పెళ్లి తదితర అంశాలు చర్చనీయాంశమయ్యాయి.
10 మే , 1978న గుంటూరులో జన్మించారు సునీత. ఆమె పూర్తి పేరు సునీత ఉపద్రష్ట. ఆరేళ్ల వయసులోనే సంగీతంలో ఓనమాలు దిద్దారు సునీత. ఆ వయసులోనే స్టేజ్ షోలు, కచేరీలలో పాల్గొనే అవకాశం ఆమెకు దక్కింది. 13 ఏళ్ల వయసులోనే త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొన్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం సంగీతంలో మరింత శిక్షణ తీసుకోవడానికి గాను స్కాలర్షిప్ మంజూరు చేసింది. 15 ఏళ్ల వయసులోనే సినీ నేపథ్య గాయనీగా టాలీవుడ్లో అడుగుపెట్టారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీలో ఈ వేళలో నీవు అనే సాంగ్ ఆమె పాడిన తొలి పాట.

30 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడిన సునీత 9 నంది అవార్డ్స్ని, 2 ఫిలింఫేర్ సౌత్ పురస్కారాలు అందుకున్నారు. 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి లతా మంగేష్కర్ బెస్ట్ సింగర్ అవార్డ్ను పొందారు. సునీతతో సింగర్తో పాటు నటి, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 110 మంది మహిళా నటులకు 750కి పైగా సినిమాలలో గాత్రదానం చేసి రికార్డు నెలకొల్పారు సునీత. కెరీర్ పీక్స్లో ఉన్న దశలోనే 19 ఏళ్ల వయసులో కిరణ్ గోపరాజు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సునీత. ఈ దంపతులకు ఆకాష్, శ్రేయ సంతానం.
అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. కుటుంబ సభ్యుల అంగీకారంతో కిరణ్, సునీతలు విడాకులు తీసుకుని విడిపోయారు. ఓ దర్శకుడితో సునీత క్లోజ్గా ఉండటం వల్లే ఈ దంపతుల మధ్య విడాకులు చోటు చేసుకున్నట్లుగా అప్పట్లో గాసిప్స్ వచ్చాయి. అయితే వీరిద్దరూ వాటిని ఖండించారు కూడా. విడాకుల తర్వాత పిల్లలతో రోడ్డు మీదకొచ్చిన సునీత .. ఒంటరి మహిళగా వారే జీవితంగా బతికి పెంచి ప్రయోజకుల్ని చేశారు. అయితే సునీత రెండో పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో రకరకాల గాసిప్స్ వచ్చేవి.
అయితే పిల్లలు, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సునీత రెండో పెళ్లి చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త, మ్యాంగో మ్యూజిక్ సంస్ధ అదినేత రామ్ వీరపనేనిని ఆమె ద్వితీయ వివాహం చేసుకున్నారు. రామ్కి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. కరోనా సమయంలో హైదరాబాద్ అమ్మపల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రామ్ - సునీతలు ఒక్కటయ్యారు.
రామ్తో పెళ్లి తర్వాత తన జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సునీత సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ ఎప్పటికప్పుడు కీలక విషయాలు పంచుకుంటున్నారు. కొడుకుని టాలీవుడ్లో హీరోగా నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాటలు పడుతూనే బుల్లితెర మీద పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రవస్తి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఇది రాబోయే రోజుల్లో ఎలా టర్న్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











