Adipurush: ప్రభాస్ టీమ్కు బిగ్ రిలీఫ్.. ఆదిపురుష్కు అలా విముక్తి!
Adipurush: పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరామ చంద్రుడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా ఇటీవలే వచ్చిన చిత్రం ఆదిపురుష్. రామాయణ ఇతిహాసాన్ని సరికొత్త రూపంలో చూపించే ప్రయత్నం చేశారు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్. అయితే ఈ సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుంచి గ్రాఫిక్స్ బాలేవు, సినిమా బాలేవు, హీరోహీరోయిన్లు సెట్ అవ్వలేరంటూ పెద్ద చర్చే సాగింది. కానీ వీటన్నిటినీ దాటుకొని జూన్ 14వ తేదీన ఈ సినిమా విడుదల అయింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
భారీ బడ్డెట్ తో రూపొందించిన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో మూవీ టీం అంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్నుంచి కోలుకోవడానికి చాలానే సమయం తీసుకున్నారు. కానీ పూర్తిగా కోలుకోకముందే పలువురు చిత్ర బృందానికి షాక్ ఇచ్చారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా పురాణాలను అపహాస్యం చేశారంటూ వివిధ హైకోర్టుల్లో కేసులు పెట్టారు. దీంతో సినీ బృందం మరింత నిరాశకు గురైంది. కానీ ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆదిపురుష్ టీంకు ఉపశమనం లభించింది.

సెన్సార్ సర్టిఫికేట్ వచ్చాకా చర్చ అనవరసం:
తాజాగా సుప్రీం కోర్టు ఆదిపురుష్ సినిమాపై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చాకా.. సినిమాపై ఏ విషయంలో అయినా విచారణలు అవరసం లేదని సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇప్పటికి అయినా ముగింపు పలకండంటూ వ్యాఖ్యానించింది. దీనిపై వివిధ కోర్టుల్లో జరుగుతున్న వాదనలు అన్ని అనవసరం అయినవే అంటూ వెల్లడించింది. ఈక్రమంలోనే కేసులన్నింటినీ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కొట్టేశారు.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అనేక రకాల కారణాలతో సినిమా వివాదాల పాలైంది. సినిమాలో నటించిన నటులు వేసుకున్న బట్టల దగ్గర నుంచి వారు ఉపయోగించిన భాష, చిత్రీకరించిన ప్రదేశాలు, గ్రాఫిక్స్... ఇలా ఒక్కటేమిటి సవాలక్ష కారణాలు చెబుతూ.. ఎంతో మంది ట్రోల్స్ చేశారు. ఒక్కొక్క దాని నుంచి మెల్లి మెల్లిగా బయట పడుతూ వచ్చింది చిత్రబృందం. చాలా వాయిదాల తర్వాత సినిమాను విడుదల చేశారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయిన ఈ సినిమాకు అజయ్ - అతుల్ సంగీతం అందించారు. అలాగే రామజోగయ్య శాస్త్రి పాటలు రాశారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను విడుదల చేసింది. త్రీడీతో పాటు, ఐమాక్స్ ఫార్మాట్స్ లో అన్ని హంగులతో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రం బాలేకపోవడంతో అంతా తీవ్ర నిరాశకు గురయ్యారు.


Click it and Unblock the Notifications











