Thug Life: పంతం నెగ్గించుకున్న కమల్ హాసన్ .. కర్ణాటకలో థగ్లైఫ్కు లైన్ క్లియర్
మణిరత్నం దర్శకత్వంలో కోలీవుడ్ దిగ్గజ నటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్లైఫ్. నాయకుడు తర్వాత దాదాపు 38 ఏళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ పలు వివాదాల్లో చిక్కుకుంది. తన కూతురు వయసున్న అభిరామితో లిప్లాక్, త్రిషతో రొమాన్స్తో పాటు కన్నడ భాషపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమంది. కమల్ హాసన్ వెనక్కి తగ్గకపోవడంతో థగ్లైఫ్ రిలీజ్ కర్ణాటకలో వాయిదా పడింది. చివరికి సుప్రీంకోర్టు వరకు వ్యవహారం నడిచింది.
జూన్ 5న విడుదలైన థగ్లైఫ్
థగ్లైఫ్ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్పై దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్తో కమల్ హాసన్, మహేంద్రన్, శివ అనంత్, ఉదయనిధి స్టాలిన్లు నిర్మించారు. మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించగా, రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించారు. శింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ అయ్యింది.

కన్నడ భాషపై కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు
థగ్లైఫ్ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా బెంగళూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నడ భాషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు కమల్ హాసన్. ఈ వ్యాఖ్యలపై కన్నడ సంఘాలు భగ్గుమన్నాయి. కర్ణాటక ప్రజలకు కమల్ బేషరతుగా క్షమాపణలు చెప్పకుంటే థగ్లైఫ్ సినిమాను విడుదల చేయనివ్వమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి. కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలి సైతం వారికి మద్ధతుగా తీర్మానం చేసింది. దీనిపై కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం సైతం కర్ణాటక ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సూచించింది. దీనికి కమల్ నిరాకరించడంతో సినిమా విడుదల ఆ రాష్ట్రంలో ఆగిపోయింది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన నిర్మాతలు
అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని నిషేధించారంటూ సుప్రీంకోర్టులో థగ్లైఫ్ నిర్మాతలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కర్ణాటక హైకోర్టులో ఉన్న కేసును సుప్రీం తనకు బదిలీ చేసుకుని విచారణ జరిపింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. తాజాగా మంగళవారం థగ్లైఫ్ చిత్రంపై విచారణ జరగ్గా.. చిత్ర యూనిట్కు ఊరట లభించింది. ఈ చిత్రాన్ని కర్ణాటకలో విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కన్నడ సంఘాలపై సుప్రీం ఆగ్రహం
అలాగే కన్నడ సంఘాల తీరుపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. థియేటర్లలో ఏ సినిమాలు ఆడాలో నిర్ణయించే అధికారం ఆ సంఘాలకు లేదని స్పష్టం చేసింది. కన్నడ ప్రజలు.. కమల్ హాసన్ వ్యాఖ్యలను విభేదించవచ్చని అయితే ఒకసారి సెన్సార్ ఓ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దానిని విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు సూచించింది. సదరు చిత్రాన్ని చూడాలా? వద్దా? అనే అధికారం పూర్తిగా ప్రజలదేనని స్పష్టం చేసింది. అలాగే కమల్ హాసన్ను క్షమాపణలు చెప్పమని కోరే అధికారం మీకు లేదంటూ కర్ణాటక హైకోర్టు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం తీర్పుతో థగ్లైఫ్ యూనిట్ సంబరాలు జరుపుకుంటుండగా.. ఈ సినిమా విడుదలకు కర్ణాటకలో లైన్ క్లియర్ అయ్యింది. అయితే ఇప్పటికే థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న థగ్లైఫ్ నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చేలా ఉంది. ఓటీటీ సంస్థ కూడా డీల్ విషయంలో వెనక్కి తగ్గడంతో కర్ణాటకలో థగ్లైఫ్కు ఏ మేరకు ఆదరణ దక్కుతుందనేది చూడాలి.


Click it and Unblock the Notifications











