మెగాస్టార్ సతీమణి సురేఖ కొణిదెల చేతుల మీదుగా కనకదుర్గ.. సోదరుడు అరవింద్ కలిసి..!
హిందూ దేవతలు, సంప్రదాయాలు, సనాతన ధర్మం నేపథ్యంగా సాగే కనకదుర్గ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరవ్వగా పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అయితే ప్రచారానికి, మీడియాకు దూరంగా ఉండే మెగాస్టార్ సతీమణి సురేఖ కొణిదెల చేతుల మీదుగా ఈ మూవీ ఓపెనింగ్ జరగడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా పూజా కార్యక్రమానికి, ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలా జరిగింది? ఈ ఓపెనింగ్కు ఎవరెవరు హాజరయ్యారనే వివరాల్లోకి వెళితే..
తమిళ సినీ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. టాలీవుడ్లో తమ మొదటి చిత్రాన్ని టెంపుల్ టౌన్ పిక్చర్స్తో కలిసి కనకదుర్గ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో వెర్సటైల్ యాక్టర్ అల్లరి నరేష్, కాజల్ చౌదరీ జంటగా నటిస్తున్నారు. సుబ్బరాజు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కథను అందిస్తుండగా, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్.రవి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

భారతీయ పురాణాలు, దేవతల నేపథ్యంగా దివ్య ప్రపంచాన్ని ఆవిష్కరించే కోణంలో రూపొందుతున్న ఈ సినిమా భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం అంశాలతో ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను అందించే ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, మెగాస్టార్ సతీమణి సురేఖ కొణిదెల స్విచ్ఛాన్ చేశారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్టును అందించగా, ప్రముఖ నిర్మాత స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు.
అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని, టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. దక్షిణ భారతీయ సినిమా రంగంలో మధురమైన అనుభూతిని అందించే కథలను చెప్పడంలో మా సంస్థ ప్రత్యేకంగా గుర్తింపును సొంతం చేసుకొన్నది. తమిళంలో మా ప్రయాణం ప్రోత్సాహకరంగా సాగింది. తెలుగులో ఈ సినిమా ద్వారా అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. భక్తి, సంస్కృతి, భావోద్వేగాల కలయికతో ఈ సినిమా రూపొందుతుంది అని అన్నారు. జీవితంలో చిద్రమైన ఒక మనిషి, తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది అని దర్శకుడు ప్రదీప్ మద్దాలి అన్నారు.

కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో సురేఖ కొణిదెలతో పాటుగా ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, హరీష్ శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకట్, ప్రశాంత్ వర్మ, మధుర శ్రీధర్, స్వప్నాదత్, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మా కస్తూరి రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు, వైఘా రెడ్డి, విరుప తదితరులు అతిథులుగా విచ్చేశారు. సినిమా భావాన్ని ప్రతిబింబిస్తూ పూజా కార్యక్రమం చివర్లో కనకదుర్గ అమ్మవారి దివ్య స్త్రీ శక్తిని ప్రత్యేకంగా స్మరించుకున్నారు. హాజరైన మహిళలు కలిసి అమ్మవారి శక్తి, కరుణ, మహిమను కొనియాడారు.


Click it and Unblock the Notifications











