డబుల్ జాక్ పాట్ తగిలింది.. నయన్పై తమన్నా కామెంట్స్
సౌత్ సినిమాల్లోకెల్లా క్వీన్ ఆఫ్ ది హీరోయిన్స్గా చెలామణి అవుతోంది నయనతార. తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో స్టార్ హీరోయిన్గా కీర్తించబడుతూ అందరు అగ్ర హీరోల సరసన నటించిన ఈమె ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అందులో ఒకటే 'సైరా నరసింహా రెడ్డి'. తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో నయనతారతో పాటు తమన్నా కూడా నటిస్తోంది. 'సైరా' నుంచి ఇప్పటికే విడుదలైన తమన్నా లుక్ మంచి స్పందన తెచ్చుకుంది.
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా 'సైరా' విశేషాలను పంచుకుంది. తన కెరీర్ లో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా డబుల్ జాక్ పాట్ లాంటిదని పేర్కొంటూ ఇంతటి ప్రతిష్టాత్మక సినిమాలో భాగమవడం తన అదృష్టమని తెలిపింది. తాను అమితంగా అభిమానించే హీరోయిన్ నయనతార అని, అలాంటిది ఆమెతోనే తెర పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. నయన్ తో కలిసి తాను నటించిన కొన్ని సన్నివేశాలు తనకు ఎంతో సంతోషాన్ని మిగిల్చాయని తమన్నా చెప్పుకొచ్చింది. ఈ సినిమా విడుదల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లుగా పేర్కొంది తమన్నా.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా 'సైరా నరసింహా రెడ్డి' సినిమా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. అమితాబ్ బచ్చన్, కుచ్చ సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 2 న ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











