దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత.. మరణానికి కారణం ఏంటంటే?
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మరణంతో విషాదంలో కూరుకుపోయిన తమిళ చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. దర్శకుడు, నటుడు కే. భాగ్యరాజ్ జూన్ 27న చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. భాగ్యరాజ్ మరణవార్త తెలుసుకున్న కోలీవుడ్ వర్గాలు షాక్కు గురయ్యాయి. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

భాగ్యరాజ్ అసలు పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953 జనవరి 7న కోయంబత్తూరు సమీపంలోని వెల్లన్కోయిల్లో ఆయన జన్మించారు. దర్శకులు జీ రామకృష్ణన్, భారతీరాజాల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు భాగ్యరాజ్. స్క్రిప్ట్ రాయడంలో ఆయన టాలెంట్ను దర్శకులు గుర్తించి మరింత ప్రోత్సహించారు. జూనియర్ ఆర్టిస్ట్గా చిన్నా చితకా పాత్రలలో నటించారు భాగ్యరాజ్. 1979లో సుధాకర్, సుమతి తదితరులతో ఆయన తెరకెక్కించిన సువరిల్లధ చిత్రాంగల్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయనకు అవకాశాలు క్యూకట్టాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ముంతానై ముడిచు అనే సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమై భాగ్యరాజ్కు గుర్తింపు తీసుకొచ్చింది. బాలీవుడ్ సూపర్స్టార్ రాజేష్ ఖన్నా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసి హిట్ కొట్టారు. దర్శకుడిగా 25 సినిమాలు తెరకెక్కించిన భాగ్యరాజ్.. చివరిసారిగా 2010లో తన కుమారుడు శంతను భాగ్యరాజ్ హీరోగా సిద్ధూ ప్లస్ 2ను డైరెక్ట్ చేశారు.
తెలుగువారికి కూడా భాగ్యరాజ్ సుపరిచితుడే. అవునా, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటి కొస్తే ఏం తెస్తారు, మేం వయసుకు వచ్చాం, రెడ్ అలర్ట్, సిత, 35తో పాటు గతేడాది కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్ హీరోలుగా వచ్చిన కుబేరలో భాగ్యరాజ్ ఓ కీలకపాత్ర పోషించారు. ఆయన తమిళంలో డైరెక్ట్ చేసిన, నటించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయి సూపర్హిట్ అయ్యాయి. మారణ హోమం, పెళ్లి చూపులు, అదిరింది అల్లుడు, అబ్బాయిగారు, సుందరకాండ తదితర చిత్రాలు ఇందుకు ఉదాహరణ. స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న భాగ్యరాజ్.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన పలు సినిమాలకు కథను అందించారు.
భాగ్యరాజ్ తొలుత నటి ప్రవీణను 1981లో పెళ్లాడారు. అయితే పెళ్లయిన కొద్దికాలానికే జాండీస్ బారినపడిన ఆమె 1983లో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో తన సహనటి పూర్ణిమ జయరామ్ను భాగ్యరాజ్ 1984లో రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్ సంతానం. రాజకీయాలపైనా భాగ్యరాజ్కు తొలి నుంచి ఆసక్తి ఎక్కువ. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్కు వీరాభిమాని అయిన భాగ్యరాజ్.. 1989లో ఎంజీఆర్ మక్కల్ మున్నేట్ర కజగం (ఎంజీఆర్ ఎంఎంకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి 1991 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా పరాజయం పాలైంది. దాంతో భాగ్యరాజ్ అన్నాడీఎంకేలో చేరారు.. ఆ తర్వాత 2006లో కరుణానిధి సమక్షంలో డీఎంకేలో చేరారు భాగ్యరాజ్. కొద్దికాలానికే ఆ పార్టీని కూడా విడిచిపెట్టేశారు.
అలనాటి నటీమణులు ఊర్వశి, కల్పనలను సినీరంగానికి పరిచయం చేశారు భాగ్యరాజ్. బుల్లితెరపైనా ఆయన సత్తాచాటారు. చితి 2, రాజా రాణి, సెంథూర పూవే, విద్యా నెంబర్ 1 వంటి తమిళ సీరియల్స్తో అలరించారు. అలాగే బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగానూ వ్యవహరించారు. భాగ్య అనే వారపత్రికకు ఎడిటర్గా వ్యవహరిస్తూ ఎన్నో నవలలు, వ్యాసాలు రాశారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్గా, కంపోజర్గా చిత్ర పరిశ్రమకు 50 ఏళ్లుగా సేవలందించారు కే భాగ్యరాజ్. సినీరంగానికి ఆయన అందించిన సేవలకు గాను 2014లో సైమా నుంచి లైఫ్టైం అచీవ్మెంట్ అవార్డ్ అందుకున్నారు. భాగ్యరాజ్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయ్యింది.


Click it and Unblock the Notifications


