అసెంబ్లీ అగ్ని పరీక్షలో విజయ్ గెలుపు.. దళపతి సర్కార్ విజయం ఎలా అంటే?
ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎన్నడూ లేని విధంగా హైడ్రామాను తలపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో సినీనటుడు దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 118 స్థానాల మేజిక్ ఫిగర్కు దూరంలో నిలిచిపోయింది. దీంతో విజయ్ .. లోక్ భవన్ చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ వంటి పార్టీల మద్ధతుతో చివరికి ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మే 13 నాటికి అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో బలం నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఆదేశించారు.

అయితే విజయ్ ప్రభుత్వానికి బుధవారం విశ్వాస పరీక్ష ఉంటుందని అసెంబ్లీ వర్గాలు ప్రకటించారు. దాంతో దళపతి ఈ గండాన్ని ఎలా గట్టెక్కుతారు? టీవీకే కూటమిలోని మిత్రపక్షాలు ఎలాంటి మెలికలు పెడతాయి? విజయ్ ప్రభుత్వం నాలుగు రోజులకే కుప్పకూలుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అందరి అంచనాలను తలక్రిందులు విజయ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది.
తొలుత విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి రీల్ ప్రభుత్వం కాదు, రియల్ ప్రభుత్వం కావాలి. డీఎంకే కూటమిలోని మా మిత్రపక్షాలు సాయం చేయడం వల్లే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం సీఎం విజయ్.. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారు. ఈ విశ్వాస పరీక్ష ఓటింగ్లో డీఎంకే పాల్గొనదని ఉదయనిధి తన సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు.
అటు మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మాట్లాడుతూ.. విశ్వాస పరీక్ష సందర్భంగా తమ ఎమ్మెల్యేలకు డబ్బులు ఆపర్ చేశారు. బలపరీక్షకు ముందు మా పార్టీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కలవడం సరికాదు. మా పార్టీ ఐక్యంగానేఉంది.. తాము విజయ్కి వ్యతిరేకంగానే ఓటేస్తామన్నారు. అయితే అన్నాడీఎంకే రెబల్ నేత వేలుమణి మాత్రం తామంతా సీఎం విజయ్కి మద్ధతుగా నిలుస్తామని తేల్చేశారు.
ఆ వెంటనే విశ్వాస పరీక్షకు స్పీకర్ ఓటింగ్ ప్రారంభించారు. సాధారణంగా చేతులు పైకెత్తడం, బ్యాలెట్ ఓటింగ్ మాదిరిగా కాకుండా ఒక్కో సభ్యుడి పేరును పిలుస్తు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సభాపతి నమోదు చేసుకున్నారు. అనంతరం విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది, వ్యతిరేకంగా 22 మంది సభ్యులు ఓట్లు వేశారు. డీఎంకే ఓటింగ్ నుంచి వాకౌట్ చేయగా.. అన్నాడీఎంకే రెబల్ గ్రూప్ టీవీకేకు మద్ధతుగా నిలవడం తమిళ రాజకీయాల్లో కలకలం రేపింది.
అనంతరం తన ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుంది.. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. అందరికీ సామాజిక న్యాయాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు 107 సభ్యులు, డీఎంకే 59, అన్నాడీఎంకే 47, కాంగ్రెస్ 5, పీఎంకే 4, ఐయూఎంఎల్ 2, సీపీఐ 2, వీసీకే 2, సీపీఎం 2, బీజేపీ 1, డీఎండీకే 1, ఏఎంఎంకే 1 సభ్యుడిని బలాన్ని కలిగిఉన్నాయి.


Click it and Unblock the Notifications



