తారకరత్నకు కన్నీటి వీడ్కోలు.. కంటతడి పెట్టిన బాలయ్య.. వైకుంఠరథంలో చంద్రబాబు
నటుడు, తెలుగుదేశం పార్టీ అభిమాని నందమూరి తారకరత్న అంత్యక్రియలు వేలాదిమంది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య ముగిసాయి. జనవరి 27వ తేదీన కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్న కోమాలోకి వెళ్లిపోవడం తెలిసిందే. కుప్పంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరు నారాయణ హృదయాల హాస్పిటల్కు తరలించారు. దాదాపు 23 రోజులపాటు మృత్యువుతో పోరాటం చేస్తూ ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న మరణవార్తతో అభిమానులు, బంధువులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థించారు. తారకరత్న అంత్యక్రియల వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని నారాయణ హృదయాల హాస్పిటల్లో తుదిశ్వాస విడిచిన తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్కు తరలించారు. ఆదివారం రోజున తారకరత్న నివాసంలో కుటుంబ, బంధువుల చివరిచూపుకోసం ఉంచారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో అభిమానుల సందర్శనార్థం కోసం హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్కు తరలించారు. ఫిలిం చాంబర్లో ఆయన పార్తీవ దేహానికి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు శ్రద్దాంజలి ఘటించారు. అనంతరం వేలాది మందితో తారకరత్న అంతిమ యాత్ర మొదలైంది.

తారకరత్న తండ్రి మోహనకృష్ణ తన కుమారుడికి అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. పుట్టెడు దు:ఖంలో మునిగిన బాలకృష్ణ, నందమూరి సోదరులు తారకరత్న పాడెను మోశారు. అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ పాల్గొన్నారు. వైకుంఠ రథంలో ఇద్దరు మహాప్రస్థానానికి చేరుకొన్నారు. హిందూ సంప్రదాయ పద్దతులను అనుసరించి తారకరత్న అంత్యక్రియలను పూర్తి చేశారు. తండ్రి మోహన్ కృష్ణ తన కుమారుడి చితికి నిప్పంటించారు.

ఆద్యంతం విషాదం, అభిమానుల దు:ఖంతో సాగిన అంత్యక్రియల్లో ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ పాల్గొన్నారు. అభిమానులు తారకరత్న అమర్ రహే అంటూ నినాదాలు చేసి శ్రద్దాంజలి ఘటించారు.


Click it and Unblock the Notifications











