ధనశ్రీతో చాహల్ విడాకులు.. ఫైనల్ డీల్ లీక్, ఎన్ని కోట్లు ఇస్తున్నాడో తెలుసా?
ఇటీవలి కాలంలో సెలబ్రెటీల డైవర్స్ వార్తల్లో నిలుస్తున్నాయి. ఎప్పుడు ఎవరు విడాకులు తీసుకుంటారో తెలియక వారి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సెలబ్రెటీలు తమ సోషల్ మీడియా ఖాతాలలో తమ జీవిత భాగస్వామి / పార్ట్నర్లను అన్ఫాలో చేసినా , బ్లాక్ చేసినా, వారి ఫోటోలను తొలగించినా జనం టెన్షన్ పడే పరిస్ధితులు నెలకొంటున్నాయి. సెలబ్రెటీ డివోర్స్ ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. కారణాలు ఏవైనా ఇలాంటి ప్రముఖులు విడాకులు తీసుకుంటూ ఉండటం ప్రజల్లోకి తప్పుడు సంకేతంగా వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సామాన్యులు విడాకులు తీసుకుంటేనే భర్త నుంచి భరణం కింద భార్య తన అవసరాలు, పిల్లల పోషణ కింద ఎంతో కొంత తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది కోట్లాది రూపాయల సంపద, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ప్రముఖుల నుంచి వారి భార్యలు విడిపోతే భరణం కింద ఎంత తీసుకుంటున్నారనే చర్చ జరగడం కామన్. సెలబ్రెటీలు తమ మనస్తత్వానికి పడని జీవిత భాగస్వాములను కోట్లు కుమ్మరించి వదిలించుకుంటున్నారనే వాదనలూ ఉన్నాయి. దీంతో ప్రముఖుల విడాకుల విషయంలో భరణం అనేది ఈ మధ్యకాలంలో చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్- తన సతీమణి ధనశ్రీ వర్మతో విడాకులకు రెడీ అయిన సంగతి తెలిసిందే. మార్చి 20వ తేదీన వీరి విడాకులపై ఫ్యామిలీ కోర్ట్ తుది తీర్పు వెలువరించనుంది. స్వతహాగా యూట్యూబర్ , కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ పలు పాటలకు డ్యాన్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టి పాపులర్ అయ్యారు. అలాగే ఓ హిందీ రియాలిటీ షోలోనూ కంటెస్టెంట్గా పాల్గొన్నారు ధనశ్రీ. గతంలో శ్రేయస్ అయ్యర్ సహా పలువురు టీమిండియా క్రికెటర్లతో డ్యాన్స్ చేయడంతో పాటు శ్రేయస్ అయ్యర్తో ప్రేమాయణం సాగించినట్లుగానూ వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో చాహల్తో పరిచయం ప్రేమగా మారడంతో వీరిద్దరూ పెద్దల అంగీకారంతో 2020 డిసెంబర్ 20న గురుగ్రామ్లోని ఓ రిసార్ట్లో గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ అనూహ్యంగా ఈ జంట విడిపోతున్నారనే వార్తలు వచ్చాయి. దీనిపై చాహల్ స్పందిస్తూ తాము విడాకులు తీసుకోవచ్చు.. తీసుకోకపోవచ్చు. కానీ మా ఇద్దరి ప్రైవసీని గౌరవించాలని చాహల్ కోరారు. డివోర్స్ వార్తలను నిజం చేస్తూ చాహల్ - ధనశ్రీలు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.
భరణం కింద రూ.60 కోట్లు ఇచ్చేందుకు చాహల్ అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అవన్నీ నిరాధారమైనవేనని తర్వాత తేలింది. ఆమెకు రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించాడని, ఇందులో కొంత బకాయి ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నందున 6 నెలల కూలింగ్ పీరియడ్ను మినహాయించాలని వీరిద్దరూ అభ్యర్ధించగా ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది.
దీంతో ఈ తీర్పును వీరిద్దరూ బాంబే హైకోర్టులో సవాల్ చేయగా చాహల్ - ధనశ్రీలకు అనుకూలంగా 6 నెలల కూలింగ్ పీరియడ్ను మినహాయిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్పడంతో పాటు మార్చి 20 లోగా విడాకులపై తుది తీర్పు ఇవ్వాల్సిందిగా ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది బాంబే హైకోర్టు. ఈ నేపథ్యంలో గురువారం యుజ్వేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మల విడాకుల పిటిషన్పై తుది తీర్పు రానుంది.


Click it and Unblock the Notifications











