ఆర్జీవీ మంచి ఫ్రెండ్, ప్రభాస్ రేంజ్ అది.. టాలీవుడ్లో రాజులంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
టాలీవుడ్లో వివాదరహితుడు, అజాతశత్రువుగా గుర్తింపు తెచ్చుకుని హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు ఎంతో ఇష్టపడే వ్యక్తి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. స్నేహానికి ప్రాణమిస్తూ, మిత్రుల కోసం నిలబడుతూ అందరి చేత డార్లింగ్ అనిపించుకున్నారు. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్ కావడమే గాక.. సలార్, ఆదిపురుష్, కల్కి 2898 ఏడీ వంటి సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమకు ఐకాన్గా మారారు ప్రభాస్.
సినిమాకు రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్.. తన సంపాదనను కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమాజం కోసం ఖర్చు చేస్తుంటాడు. మూడో కంటికి తెలియనివ్వకుండా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశాడు. మంచితనానికి, మంచి మనసుకు పెట్టింది పేరైన ప్రభాస్.. తన ఇంటికి ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టుకుండా పంపరు. తన మిత్రులు, సన్నిహితులకు బహుమతులు, స్వీట్లు పంపడం ప్రభాస్కు అలవాటు.

అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ యూనిట్ సభ్యులందరికీ తన ఇంటి నుంచి భోజనాలు తెప్పిస్తుంటాడు ప్రభాస్. ఇటీవల వరదలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనలో సమస్తం కోల్పోయిన కేరళలోని వయనాడ్ వాసులకు డార్లింగ్ అండగా నిలబడ్డారు. సహాయ పునరావాస కార్యక్రమాల నిమిత్తం తన వంతుగా కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.2 కోట్ల విరాళం ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు.
సినీ పరిశ్రమలో ఇన్నేళ్ల కెరీర్లో ఒక్క మచ్చ లేకుండా , ఎవరైనా పొగడటమే తప్పించి, విమర్శించని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాసే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో జరిగిన క్షత్రియ సేవా సమితి సభలో పాల్గొన్న సీఎం ప్రసంగిస్తూ.. విజయానికి, నమ్మకానికి క్షత్రియులు మారుపేరన్నారు. కష్టపడే గుణం వల్లే క్షత్రియులు ఎక్కడున్నా సక్సెస్ అవుతున్నారని.. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం వెనుక బోసురాజు కీలకపాత్ర పోషించారని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇదే సమయంలో దివంగత సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. క్షత్రియ సామాజిక వర్గానికే చెందిన ప్రభాస్ తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని సీఎం ప్రశంసించారు. హాలీవుడ్ రేంజ్ మూవీ బాహుబలిని ప్రభాస్ లేకుండా ఊహించలేమన్నారు. బాలీవుడ్లో సత్తా చాటిన రామ్ గోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని ఆయన తెలిపారు. క్షత్రియులకు తమ ప్రభుత్వ సహకారం ఉంటుందని.. క్షత్రియ భవన్ కోసం సహకరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











