అప్పటి దాకా ఆగండి, తొందర పడొద్దు… సినీ నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ హెచ్చరికలు !
కరోనా మహమ్మారి రెండో దశ కారణంగా మూతపడిన అన్ని థియేటర్లు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని తెలియని పరిస్థితి నెలకొంది.. ఈ నేపథ్యంలో పెద్ద సినిమా నిర్మాతలే కాక చిన్న సినిమా నిర్మాతలు సైతం తమ సినిమాలను ఓటీటీలో సినిమా రిలీజ్ చేసే అవకాశం పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

థియేటర్ ల ఓపెనింగ్ మీద అనుమానాలు
విడుదలకు సిద్ధమైన అన్ని సినిమాలను థియేటర్స్ లో కాకుండా డిజిటల్ ప్లాట్ ఫారంలో విడుదల చేస్తే భవిష్యత్తులో సినిమా రంగానికి ఇబ్బందులు తప్పవని తెలుగు సినీ నిర్మాతలకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినా ప్రజలు థియేటర్లకు రారు ఏమో అన్న అనుమానంతో ప్రస్తుతానికి థియేటర్ల యజమానులు థియేటర్ లో ఓపెన్ చేయడానికి సిద్ధంగా లేరు.

డిజిటల్ రిలీజ్ కు సిద్దం
ఈ నేపథ్యంలోనే ఎక్కువ రోజులు సినిమాలను తమ వద్ద పెట్టుకోవడం కంటే డిజిటల్ లో రిలీజ్ చేస్తేనే నయం అని భావిస్తూ కొందరు నిర్మాతలు ఆ విధంగా ముందుకు వెళుతున్నారు. ఈ విషయం మీద చర్చలు జరపడానికి సునీల్ నారంగ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యులు ఎగ్జిబిటర్లు ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు సాధ్యాసాధ్యాలు చర్చించిన పిమ్మట ఎవరూ అక్టోబర్ 31 లోపు తమ సినిమాలను డిజిటల్ వేదికగా విడుదల చేయకుండా ఉండేలా చూడాలని నిర్మాతలను కోరారు.

అప్పుడు అడ్డు చెప్పం
ఒకవేళ థర్డ్ వేవ్ వలన మళ్ళీ ఇబ్బంది కలిగి అప్పుడు థియేటర్లు ఓపెన్ చేసే పరిస్థితి లేకపోతే అప్పుడు ఓటీటీలో విడుదల చేసుకోవడానికి ఎవరూ అడ్డు చెప్పరని అయితే ఈ అంశం మీద మరింత క్లారిటీ కోసం వచ్చే బుధవారం జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా థియేటర్ల ప్రారంభం విషయం, అలాగే టికెట్ల రేట్లను పెంచే విషయం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.

ఇబ్బందులు పడాల్సిందే
ఇప్పటిదాకా థియేటర్ల మీద డబ్బు సంపాదించి ఇప్పుడు ఒక కొత్త మాధ్యమం అందుబాటులోకి వచ్చింది కదా అని దాని వెంట పడటం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే థియేటర్ల యజమానులు చాలా నష్టపోయారని పేర్కొన్న ఆయన ఇప్పుడు నిర్మాతలు ఎవరైనా తమ ఇష్టానికి థియేటర్లను కాదని డిజిటల్ లో సినిమాలు రిలీజ్ చేస్తే రాబోయే రోజుల్లో వాళ్లకి థియేటర్ల అవసరం రాకపోతాయా ?ఆ సమయంలో కచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందే అని ఆయన హెచ్చరించారు.

కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా అని
ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు, మల్టీప్లెక్స్ యాజమాన్యాల సపోర్ట్ తమకు ఉందని పేర్కొన్న ఆయన మరో మూడు నెలలు సినిమా ఓటీటీలో రిలీజ్ చేయకుండా ఉండాలని కోరుతున్నామని, తామందరూ సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఇక కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా అని ఓటీటీని చూసుకుని ఇప్పటివరకు అన్నం పెట్టిన థియేటర్లను వదిలేస్తే ఎలా అని ఛాంబర్ సెక్రెటరీ ప్రశ్నించారు. మొత్తం మీద ఈ అంశం మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications