అవార్డులు వస్తే తీసుకోలేరా? సీఎం కన్నా బిజీయా?.. సినీ ప్రముఖులకు దిల్రాజు చురకలు
నంది అవార్డుల స్థానంలో దివంగత గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గద్ధర్ సినీ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి 2024 వరకు ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ప్రభుత్వం పురస్కారాలను ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జూన్ 14న హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతకు పురస్కారాలను అందజేశారు. నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు.
కఠిన నిర్ణయాలు తప్పలేదు
తెలంగాణ ప్రభుత్వం కొన్ని విషయాలలో కఠినంగా ఉన్నా.. సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ సినిమాకు కేరాఫ్గా నిలిచిందని.. హైదరాబాద్ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా మార్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. హాలీవుడ్ను మన గడ్డపైకి తీసుకురావడానికి ఏం కావాలన్నా సిద్ధంగా ఉన్నామని రాజమౌళికి సీఎం తెలిపారు. ఎలాంటి సదుపాయాలు కావాలన్నా.. ఏ హోదాలో ఉన్న అండగా ఉంటానని తెలుగు సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

గద్ధర్ అవార్డ్స్ వెనుక 6 నెలల కష్టం
అయితే గద్దర్ అవార్డులకు ఎంపికైన పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం, సినీ పరిశ్రమ పెద్దగా ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై టాలీవుడ్ అగ్ర నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్రాజు స్పందించారు. అవార్డ్స్ ప్రదానోత్సవం విజయవంతంగా ముగియడంతో దిల్రాజు జూన్ 15న మీడియా ముందుకు వచ్చారు. గద్ధర్ అవార్డ్స్ కోసం ఆరు నెలల పాటు ఎంతో శ్రమించామని దిల్రాజు స్పష్టం చేశారు. పురస్కారాల ఎంపికకు అన్ని నిబంధనలను పరిగణనలోనికి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
బిజీగా ఉన్నా సీఎం పాల్గొన్నారు
తొలుత 2024 ఏడాదికి సంబంధించిన సినిమాలకే అవార్డులను ఎంపిక చేయాలని అనుకున్నామని.. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా పురస్కారాలు ఇస్తే బాగుంటుందని మేధావులు సూచించడంతో ఇందుకోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని దిల్రాజు స్పష్టం చేశారు. ఎంతో కష్టమైన ఈ పనిని సుదీర్ఘ కసరత్తు తర్వాత పూర్తి చేశామని ఆయన తెలిపారు. గద్ధర్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న వారందరికీ, ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి దిల్రాజు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమం కోసం తొలుత ముఖ్యమంత్రి ఒక గంట అపాయింట్మెంట్ ఇచ్చారని.. కానీ నా అభ్యర్ధన మేరకు అంత బిజీ షెడ్యూల్లోనూ ఆయన దాదాపు 2.15 గంటల పాటు ఓపికగ్గా పాల్గొన్నారని దిల్రాజు ప్రశంసించారు.
డైరీలో రాసుకోండి
ఈ అవార్డ్స్ కార్యక్రమానికి కొందరు గైర్హాజరయ్యారని మా దృష్టికి వచ్చిందని .. అయితే ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయంటే వాటిని ఖచ్చితంగా స్వీకరించాలని దిల్రాజు తెలిపారు. షూటింగ్లలో బిజీగా ఉన్నా.. ఎన్ని పనులున్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అవార్డ్ వేడుకలు ఉన్నప్పుడు.. డైరీలలో నోట్ చేసుకునైనా, అవార్డ్ వచ్చిన వారు స్వీకరించాలని ఆయన హితవు పలికారు. అందరూ అర్ధం చేసుకుని సహకరించాలని.. సినీ పరిశ్రమకు ఇది నా విజ్ఞప్తి అని దిల్రాజు అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











