మన శంకరవరప్రసాద్ గారు, రాజాసాబ్కు ఊరట.. టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు కీలక తీర్పు!
సంక్రాంతి రేసులో విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు భారీ సినిమాలకు తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుతో ఊరట లభించింది. సంక్రాంతి బరిలో ఉన్న ప్రభాస్ 'రాజాసాబ్' (The Raja Saab), చిరంజీవి 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu) సినిమాల నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ సినిమాల నిర్మాతలు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఈ రెండు సినిమాలకు వర్తించదని స్పష్టం చేసింది. ఆ తీర్పును కేవలం 'పుష్ప 2', 'ఓజీ', 'గేమ్ ఛేంజర్', 'అఖండ 2' సినిమాలకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తాజా చిత్రాల నిర్మాతలకు పెద్ద ఊరట లభించినట్టు అయింది.
గతంలో టికెట్ ధరలు పెంచేందుకు వీల్లేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని, టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలపై తమ దరఖాస్తులను పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం విచారణ జరిపిన ధర్మాసనం, గత తీర్పును ఆయా సినిమాలకూ మాత్రమే వర్తిస్తాయని కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఇక హైకోర్టు ఉత్తర్వులతో ఈ రెండు సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాతలు టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం హోంశాఖ కార్యదర్శి సీవీ ఆనంద్కు దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమ విజ్ఞప్తులను పరిశీలించాలని హోంశాఖ కార్యదర్శికి సూచించాలని వారు కోర్టును కోరగా, దీనిపై తగిన నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
అసలేం జరిగిందంటే... సంక్రాంతి బరిలో అగ్ర హీరోల సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది రాజాసాబ్' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా, చిరంజీవి హీరోగా హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రాలకు టికెట్ ధరల పెంపు కీలక అంశంగా మారింది.
'ది రాజాసాబ్' సినిమా కోసం జనవరి 8న రాత్రి ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు మూవీ మేకర్స్ సిద్ధమవుతోంది. అలాగే జనవరి 9న ఉదయం 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రీమియర్ షోల కోసం సింగిల్ స్క్రీన్లో టికెట్ ధరను పన్నులతో కలిపి రూ.800, మల్టీప్లెక్స్లలో రూ.1000 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే జనవరి 9 నుంచి 11 వరకూ, ఆ తర్వాతి రోజుల్లోనూ సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో వరుస తేదీలకు అనుగుణంగా టికెట్ ధరలు పెంచుకునేలా అనుమతి కోరారు.
ఈ నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వులు రావడంతో.. ఈ రెండు సినిమాల బుకింగ్స్ త్వరలోనే ఓపెన్ కానున్నాయి. ముఖ్యంగా 'ది రాజాసాబ్'కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్కు గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి బాక్సాఫీస్ రేసులో ఉన్న ఈ సినిమాలకు హైకోర్టు నిర్ణయం కీలకంగా మారనుంది. అయితే.. టిక్కెట్ రేట్లు ఏ మేరకు పెరుగబోతున్నాయో అనేది వేచి చూడాలి. ఇలా మొత్తానికి తెలంగాణ హైకోర్టు తాజా తీర్పుతో 'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' నిర్మాతలకు పెద్ద ఊరట లభించిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











