బెట్టింగ్ యాప్ కేసులో ట్విస్ట్ .. ఎఫ్ఐఆర్లోకి కొత్తగా 19 పేర్లు, నోటీసులు రెడీ
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బెట్టింగ్ యాప్ కుంభకోనానికి సంబంధించి తెలంగాణ పోలీసులు విచారణలో వేగం పెంచారు. ఇప్పటి పలువురు సెలబ్రెటీలు, యాంకర్లు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల పేర్లు ఈ లిస్ట్లో బయటికి వచ్చాయి. ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరి వంటి బుల్లితెర భామలను పంజాగుట్ట పోలీసులు సుదీర్ఘంగా విచారించి కీలక విషయాలు రాబట్టారు. ఈ కోవలో మరికొందరు స్టార్స్ను కూడా విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.
బెట్టింగ్ యాప్ కేసులో హీరో హీరోయిన్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, పలువురు యాంకర్లు కలిపి దాదాపు 25 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో కొందరికి నోటీసులు ఇచ్చి విచారించారు పోలీసులు. విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్ వంటి టాప్ సెలబ్రెటీలు ఉండటం కూడా చిత్ర సీమలో కలకలం రేపుతోంది. ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ వ్యవహారం తెర మీదకి వచ్చి, పోలీసులు చర్యలకు దిగారో అప్పటి నుంచి కొందరు సెలబ్రెటీలు సోషల్ మీడియా వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

ఇక బెట్టింగ్ యాప్ కేసులో ఓ ముగ్గురు స్టార్స్ పేర్లు కూడా రావడంతో కలకలం రేపుతోంది. ఓ షోలో తనకు ఎంతో ఇష్టమైన హీరో ప్రమోట్ చేయడంతో తాను బెట్టింగ్ కాశానని, ఆ తర్వాత లక్షల్లో డబ్బును పొగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి పోలీసుల ఎదుట వాపోయాడు. దీనికి సాక్ష్యంగా ఆ ఎపిసోడ్కు సంబంధించిన స్క్రీన్ షాట్లను చూపెడుతున్నాడు.
దీంతో పోలీసులు వీరిని ఏం చేయబోతున్నారు? వీరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? అంటూ ఫిలింనగర్లో చర్చ జరుగుతోంది. మరోవైపు బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే విచారణకు ఎదురైన యాంకర్ విష్ణుప్రియ.. తాజాగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలంటూ హైకోర్టును కోరారు విష్ణుప్రియ. అలాగే విచారణ సందర్భంగా ఆమె ఫోన్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసినందుకు విష్ణుప్రియ భారీ మొత్తంలో డబ్బును తీసుకున్నట్లుగా అంగీకరించారు. మొత్తంగా 15 బెట్టింగ్ యాప్లను ఆమె ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రమోట్ చేసినట్లుగా అధికారుల విచారణలో తేలింది. మరోవైపు.. బెట్టింగ్ యాప్లకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు చట్టంలో మార్పులు చేస్తున్నారు. కేవలం ప్రమోట్ చేసిన వారి మీద కేసులు పెట్టడంతో సరిపెట్టకుండా .. అసలు ఈ యాప్ నిర్వాహకుల మీద కేసులు నమోదు చేసి కఠిన శిక్షలు అమలు చేసేలా రంగం సిద్ధం చేస్తున్నారు.
దీనిలో భాగంగా 25 మంది సెలబ్రెటీలకు తోడు కొత్తగా 19 మంది బెట్టింగ్ యాప్ నిర్వాహకుల్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అలాగే సెలబ్రెటీలకు నోటీసులిచ్చి విచారించే ముందు పోలీసులు న్యాయపరమైన సలాహాలు తీసుకుంటున్నారు. బెట్టింగ్పై తెలంగాణలో నిషేధం అమల్లో ఉన్నప్పటికీ నిర్వాహకులు వేర్వేరు పేర్లతో బెట్టింగ్ యాప్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తుపరంగా ఎవరు తెలంగాణ రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించారో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











