Kushi Musical Concert మీడియా, మహిళలపై పోలీసుల దౌర్జన్యం.. బాధ్యతారాహిత్యంగా మైత్రీ నిర్వాహకులు
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్పై విజయ్ దేవరకొండ, సమంత రుత్ ప్రభు జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మించిన చిత్రం ఖుషి. సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.
ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లోని హైటెక్స్లోని హెచ్ఐసీసీ కన్వెన్షన్ సెంటర్లో ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ పేరుతో భారీగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో మీడియా, మహిళలు, చిత్ర సిబ్బందితో పోలీసులు, మైత్రీ నిర్వాహకులు ప్రవర్తించిన తీరు చాలా దారుణంగా ఉండటం వివాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్ ఫంక్షన్ కోసం బుక్ మై షో, ఇతర పద్దతుల్లో టికెట్లు అమ్మకాలు జరిపారు. దాంతో ఈవెంట్ కోసం అభిమానులు, సంగీత ప్రియులు భారీగా స్పందించారు. అయితే తీరా ఈవెంట్కు వచ్చిన వారిని నోవాటెల్ హోటల్కు చేరుకోకుండానే రోడ్డుపై అడ్డగించారు.
పార్కింగ్కు కూడా అనుమతించకుండా అడ్డుకొన్నారు. దాంతో రోడ్లపైనే బైకులు, కార్లు పార్కు చేయాల్సి వచ్చింది. టికెట్లు, పాసులు ఉన్న వారిని గేటు మూసి నిలిపివేశారు. డబ్బులు పెట్టి టికెట్లు కొన్నామని మొత్తుకొన్నా నోవాటెల్ సిబ్బంది చాలా దారుణంగా ప్రవర్తించారు. మహిళలు, ఫ్యామిలీ, పిల్లలు అనే తేడా లేకుండా గేటు వద్దే నెట్టివేశారు. ఇక బౌన్సర్ల ఆగడాలు చెప్పనక్కర్లేదు.

ఇక ఇదిలా ఉంటే.. గేటు వద్ద చేదు అనుభవాలను దాటుకొని నోవాటెల్లోని ఈవెంట్ వద్దకు చేరుకొన్న మీడియా వారితో కూడా పోలీసులు, నోవాటెల్ సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారు. ఈవెంట్ కవరేజ్ కోసం వచ్చామని చెప్పినా వినిపించుకోలేదు. పీఆర్వో శ్రీనివాస్, సురేష్ వద్ద నుంచి పాసులు, మెడలో వేసుకొనే ట్యాగులను లాగేసుకొనేందుకు ప్రయత్నించారు.
పీఆర్వోలు నచ్చజెప్పినా వారిని బయటకు నెట్టే ప్రయత్నం చేశారు. అంతలో విజయ్ దేవరకొండ మేనేజర్ అనురాగ్ వస్తే అతడిని బయటకు నెట్టివేశారు. తాను విజయ్ దేవరకొండ మేనేజర్ను చెప్పుకొన్నా.. ఫలితం లేకపోయింది. అయితే పోలీసులు తమకు సంబంధించిన వారిని చూసి చూడకుండా వదిలేశారు. కానీ మీడియాను, ఈవెంట్ క్రూను, మహిళలను నెట్టివేసే ప్రయత్నం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో మైత్రీ మూవీస్ నిర్వాహకులు ఆ ప్రాంతానికి రాగా.. తాము మీడియాకు సంబంధించిన వాళ్లం. ప్రెస్ పాసులు ఉన్నా పోలీసులు అనుమతించడం లేదు అని వారి దృష్టికి తెస్తే.. లోపల చాలా మంది మీడియా వారు ఉన్నారు. మీరు రాకపోతే నష్టం లేదు అంటూ మైత్రీ నిర్వాహకులు చాలా అమర్యాదగా సమాధానం ఇచ్చారు.
పైగా వారికి సంబంధించిన స్నేహితులు, సన్నిహితులను లోపలకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని యదేచ్ఛగా చేశారు. ఈవెంట్ హాల్ నుంచి వాష్ రూమ్ కోసం బయటకు వచ్చిన మహిళలతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు. బయటకు వస్తే పంపించేది లేదని ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించారు. పాసులు ఉన్నాయంటూ గట్టిగా మాట్లాడిన కొందరిని మెడలు పట్టి బయటకు నెట్టివేసే ప్రయత్నం చేశారు.

మీడియా, మహిళల పరిస్థితి ఇలా ఉంటే.. మిగితా పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. టికెట్లు కొనుక్కొని దూరం ప్రాంతాల నుంచి వచ్చిన వారి తీవ్ర నిరాశకు గురయ్యారు. డబ్బు పోవడమే కాకుండా పోలీసులు, మైత్రీ నిర్వాహకుల నుంచి చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సరైన చర్యలు, జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి రాకపోయేదని చాలా మంది వాపోయారు.


Click it and Unblock the Notifications











