విషమిచ్చి చంపేయండి... సినిమా టికెట్ ధరల పెంపుతో సంబంధం లేదు.. కోమటిరెడ్డి కామెంట్స్
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు వివాదం సంచలనం సృష్టించింది. సినిమా టికెట్ ధరల పెంపు ఉండదని చెబుతూనే ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తుండటం... హైకోర్టు మొట్టికాయలు వేస్తుండటం కలకలం రేపుతోంది. ఇటీవల ది రాజాసాబ్ మూవీ ప్రీమియర్స్కు అర్ధరాత్రి అనుమతులు ఇవ్వడం, టికెట్ ధరల పెంపుపై జీవో రావడం.. ఆ వెంటనే హైకోర్ట్ మరోసారి సీరియస్ అవ్వడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. తాజాగా దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, అసభ్య ప్రచారంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. నాపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆరుసార్లు గెలిచా, పైన దేవుడు ఉన్నాడు.. తప్పు చేసినవాడిని శిక్షిస్తాడు. నా మీద ఇంకా కోపం తగ్గకపోతే, నేను ఉండొద్దు అంటే ఇంత విషమిచ్చి చంపండి. మహిళా ఆఫీసర్ల మీద అభాండాలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీడియా మిత్రులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా.. మీరు రాసేముందు ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికీ భార్యాపిల్లలు ఉంటారు, అక్కాచెల్లెళ్లు ఉంటారు, దగ్గర బంధువులు ఉంటారు, మీ ఇంట్లో మహిళలు ఉంటారు. వారిని కూడా ఎవరైనా ఈ విధంగా రేటింగ్ల కోసం ఇలా రాయొద్దు. జిల్లా మంత్రిగా రివ్యూలు పెడితే అధికారుల పక్కన కూర్చోవడం తప్పా? అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి మీద, నా మీద, ఇంకో మంత్రి మీదా కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రశంసలు ఉంటాయి. ఒక్కగానొక్క కొడుకు పోతే మానసికంగా కుంగిపోయా, తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేశా. మా ఇంటికి ఎవరొచ్చినా ఖాళీ చేతులతో పోడు.. నా దగ్గర ఎంతున్నా సాయం చేస్తా. నా కొడుకు పేరు చిరస్థాయిగా ఉండేలా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నా. నాలాంటి వాడిని అవమానపరిచి, నా ఇంట్లో వాళ్లని ఇబ్బందిపెట్టి.. మహిళా ఆఫీసర్లని ఇబ్బందిపెట్టి ఏం సాధించాలని అనుకుంటున్నారు? అని కోమటిరెడ్డి మండిపడ్డారు.
సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా.. పుష్ప 2 తర్వాత కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపు కోసం నా దగ్గరకి రావొద్దని చెప్పా. వారం పది రోజుల కిందట కూడా టీవీలలో ఇదే మాట చెప్పా. మొన్నామధ్య ఒక సినిమా, రెండ్రోజుల కిందట మరో సినిమా, రేపు రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించి నా దగ్గరికి ఫైల్ రాలేదు. అసలు అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవొద్దని చెప్పా. అప్పటి నుంచి ఎవరూ కలవడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
పుష్ప 2 సమయంలో ఓ మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు అనుమతి ఇచ్చానా అని బాధపడ్డా. ఆ హాస్పిటల్ వాళ్లకు నేను ఫోన్ చేసి మాట్లాడితే పేమెంట్ రావడం లేదని చెబితే.. అప్పటికప్పుడు అసెంబ్లీ నుంచి హుటాహుటిన వెళ్లి ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయల చెక్ ఇచ్చి వచ్చా. గవర్నమెంట్ నుంచి ఒక అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రోసీజర్ ఉంటుంది, మనిషి ప్రాణం పోయినాసరే పైసలు కట్టనిదే అక్కడ ట్రీట్మెంట్ చేయరు. రేణుకగారు చనిపోతే ఆ అబ్బాయి బాధ్యత నేను తీసుకుంటానని, నేను చదివిస్తానని చెప్పా. అసెంబ్లీకి రిటర్న్ వచ్చి ఇక నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ రేట్లు పెంచబడవు. ఆ మాటకు కట్టుబడే ఉన్నానని కోమటిరెడ్డి తేల్చిచెప్పారు.


Click it and Unblock the Notifications











