CCL 2025 : ఈసారి కొట్టి చూపెడతా .. అఖిల్ అక్కినేని సవాల్
భారతదేశంలో సినిమా, క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీతారలు, క్రికెటర్లను మనోళ్లు దేవుళ్లలాగా కొలుస్తారు. ఏ ఇద్దరు కుర్రాళ్లు కలిసినా ఖచ్చితంగా మాట్లాడే టాపిక్స్లో సినిమా, క్రికెట్ లేకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. క్రికెటర్లు సినిమాల్లో నటించి శెభాష్ అనిపించుకోగా.. సినీనటులు క్రికెట్ ఆడటం అసాధ్యం. కానీ ఎంతో మంది తారలకు క్రికెట్ అంటే పిచ్చి. తీరిక వేళల్లో క్రికెట్ ఆడటంతో పాటు తీరిక వేళల్లో స్టేడియాలకు వెళ్లి లైవ్లో మ్యాచ్లు చూస్తుంటారు.
మనదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఓ సంచలనం. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించడంతో పాటు క్రికెట్ లవర్స్కు వినోదాన్ని అందించింది. ఐపీఎల్ దెబ్బకు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు సైతం తమ షెడ్యూల్స్ మార్చుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్ను ప్రేరణగా తీసుకుని భారత్లో సినీతారల కోసం సెలబ్రెటీ క్రికెట్ లీగ్ను తీసుకొచ్చారు. 2011లో ప్రారంభమైన ఈ లీగ్ .. తారలను క్రికెటర్లుగా మార్చింది.

సినీ, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్ 2025) సిద్ధమైంది. ఈ లీగ్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశంలోని అన్ని భాషల సినీ రంగాలకు చెందిన సెలబ్రెటీలు ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్ మొదలుపెట్టారు. ఈసారి తెలుగు వారియర్స్, చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్, ముంబై హీరోస్, భోజ్పురి దబాంగ్స్ బరిలో నిలిచాయి.
బెంగాల్ టైగర్ జట్టుకు కెప్టెన్గా నటుడు జిషు సేన్ గుప్తా, కర్ణాటక బుల్డోజర్స్ జట్టుకు కిచ్చ సుదీప్ కెప్టెన్గా, చెన్నై రైనోస్ జట్టుకు హీరో ఆర్య కెప్టెన్గా, ముంబై హీరోస్ జట్టుకు సాకిబ్ సలీం, తెలుగు వారియర్స్ జట్టుకు అఖిల్ అక్కినేని, పంజాబ్ ది షేర్ జట్టుకు సోను సూద్ కెప్టెన్గా, భోజ్పురి దబాంగ్స్ జట్టుకు ఎంపీ, నటుడు మనోజ్ తివారీ కెప్టెన్గా వ్యవహరిస్తారు. ఫిబ్రవరి 8న తొలి మ్యాచ్ జరగనుండగా.. మార్చి 1న సెమీ ఫైనల్, మార్చి 2న ఫైనల్ జరగనున్నాయి.
తాజాగా తెలుగు వారియర్స్ జట్టుకు చెందిన జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టాలీవుడ్ జట్టు కెప్టెన్ అఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చామని.. ఇప్పటి వరకు నాలుగు సార్లు గెలిచామని , ఐదోసారి కూడా కప్పు కొడతామని అఖిల్ సవాల్ విసిరారు. ఆటతో పాటు వినోదాన్ని కూడా అందించాలని తాము అనుకుంటున్నామని, హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో మ్యాచ్ జరుగుతుందని అక్కడికొచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని అఖిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు వారియర్స్ యజమాని సచిన్ జోషి, తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











