విజయ్ దేవరకొండ, వెంకటేష్లకు లీగల్ నోటీసులు..! ఎందుకంటే ..?
TG20 League Controversy: టీజీ20 లీగ్ (TG20 League) పెద్ద చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైన ఈ లీగ్ చుట్టూ ఇప్పుడు న్యాయపరమైన వివాదాలు చెలరేగాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండతో పాటు భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పేర్లు ఈ వివాదంలో వినిపించడం హాట్ టాపిక్ మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) తాజాగా చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బీసీసీఐ (BCCI) నుంచి అవసరమైన అనుమతులు లేకుండానే టీజీ20 లీగ్ను నిర్వహిస్తున్నారని, అలాంటి టోర్నీకి ప్రముఖులు ప్రచారకర్తలుగా వ్యవహరించడం నిబంధనలకు విరుద్ధమని టీసీఏ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో లీగ్కు మద్దతుగా నిలుస్తున్న సెలబ్రిటీలు, క్రికెటర్లకు లీగల్ నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు టీసీఏ ప్రకటించింది.

ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది విజయ్ దేవరకొండ నియామకం. ఇటీవల హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో టీజీ20 లీగ్కు విజయ్ దేవరకొండను అధికారిక బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు హెచ్సీఏ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి ప్రకటించారు. జూన్ 21 నుంచి జూలై 19 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ లీగ్ యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
అయితే టీసీఏ మాత్రం ఈ లీగ్ నిర్వహణపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. తమ వాదన ప్రకారం బీసీసీఐ అనుమతి లేకుండా టోర్నీ నిర్వహించడం నిబంధనలకు వ్యతిరేకమని చెబుతోంది. అంతేకాకుండా టీజీ20 పేరుతో కార్పొరేట్ సంస్థల నుంచి భారీ స్థాయిలో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం వల్ల యువ క్రికెటర్లు, స్పాన్సర్లు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని టీసీఏ అభిప్రాయపడుతోంది.
టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ లీగ్కు ప్రచారం చేస్తున్న హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండతో పాటు అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మలకు కూడా లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోవైపు హెచ్సీఏ మాత్రం టీజీ20 లీగ్ నిర్వహణపై పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తోంది. యువ ప్రతిభకు వేదిక కల్పించడమే లక్ష్యమని, తెలంగాణ క్రికెట్ అభివృద్ధి కోసం ఈ టోర్నీ నిర్వహిస్తున్నామని చెబుతోంది. అయితే టీసీఏ ఆరోపణలపై హెచ్సీఏ నుంచి పూర్తి స్థాయి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వివాదం కేవలం క్రికెట్ కే పరిమితం కాకుండా సినీ రంగాన్ని కూడా తాకింది. స్టార్ హీరోలు, అంతర్జాతీయ క్రికెటర్ల పేర్లు ఇందులో రావడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్గా మారింది.
టీసీఏ హెచ్చరికల తర్వాత సంబంధిత సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారు? బీసీసీఐ ఈ వ్యవహారంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుంది? హెచ్సీఏ వివరణ ఏమిటి? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications



