The Raja Saab: ‘అది ప్రభాస్ కాదు... డూప్!' రాజాసాబ్ పై నెట్టింట రచ్చ
The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి దాసరి తెరకెక్కించిన హారర్ ఫాంటసీ మూవీ ది రాజాసాబ్ (The Raja Saab). తాజాగా ఈ మూవీ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. థియేటర్లలో విడుదలైనప్పుడే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ, తాజాగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి ది రాజాసాబ్ సోషల్ మీడియాలో మరింత పెద్ద ఎత్తున ట్రోలింగ్కు గురవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన 'రాజాసాబ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. రిలీజ్కు ముందు మారుతి చేసిన "సినిమా బాగాలేకపోతే నా ఇంటికే రండి" అన్న కామెంట్స్ అప్పుడే బూమ్రాంగ్ అయ్యాయి. సినిమా డిజాస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులు దర్శకుడిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టారు.

అప్పట్లో మారుతి ఇంటికి వందల కొద్దీ క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్స్ పెట్టారన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పటికే ట్రోలింగ్ తగ్గుతుందేమో అనుకున్న సమయంలో... ఓటీటీ రిలీజ్తో మరోసారి రాజాసాబ్పై నెట్టింట సెగ రాజుకుంది. ఈసారి నెటిజన్లు సినిమా నుంచి స్క్రీన్ షాట్స్ తీసి, ఒక్కో సీన్ను విడివిడిగా విశ్లేషిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
'ఇది ప్రభాస్ కాదు... డూప్'
ప్రధానంగా ప్రభాస్ లుక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఫేస్ మార్ఫింగ్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ స్థానంలో బాడీ డబుల్ కనిపిస్తోందని, ఫేస్ స్వాప్ సరిగా చేయలేదని నెటిజన్లు అంటున్నారు. 'స్టార్ హీరోలకు డూప్ ఉండటం సహజమే... కానీ ఆడియన్స్కే తెలిసిపోయేలా నాసిరకం ఎగ్జిక్యూషన్ ఎలా?' అంటూ మారుతిని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఒక సీన్లో బస్ ఎక్కిన ప్రభాస్ గడ్డంతో కనిపిస్తే, దిగేసరికి గడ్డం ట్రిమ్ అయిపోవడం, బస్సే మారిపోవడం లాంటి కంటిన్యూయిటీ మిస్టేక్స్ను చూపిస్తూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
లాజిక్ లేని సీన్స్
సినిమాలో లాజిక్స్ పూర్తిగా మిస్సయ్యాయన్న ఆరోపణలతో సోషల్ మీడియా నిండిపోయింది. మహారాణిని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా సంజయ్ దత్ పాత్రకు వస్తే పారిపోవాల్సిన అవసరం ఏమిటని, ప్రభాస్ నానమ్మ పాత్రలో జరీనా వాహాబ్ ఇంతకాలం ఎలా బతికుంటుంది? ఆమె వయసెంత అన్న ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
అలాగే కోట్ల ఆస్తి ఉన్న పాత్ర హీరోయిన్ దగ్గర రూ.3 లక్షలు దొంగిలించడం ఏంటి? 1960ల నేపథ్యంలోని కథలో రూ.500 కొత్త నోట్లు ఎలా వచ్చాయంటూ మారుతిని ట్యాగ్ చేస్తూ వరుస పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు మూడు నాలుగు జానర్స్ మిక్స్ చేసి కథను పూర్తిగా కన్ఫ్యూజ్ చేశారని, రైటింగ్ అవుట్డేటెడ్గా ఉందంటూ దర్శకుడి స్క్రిప్ట్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఓటీటీలో 'ఎక్స్టెండెడ్ కట్'
మేకర్స్ మొదట 'ఎక్స్టెండెడ్ కట్' వస్తుందంటూ ప్రచారం చేసినా, చివరకు థియేటర్లలో ఉన్న వెర్షన్కే స్వల్ప ట్రిమ్మింగ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు. కొత్తగా యాడ్ చేసిన సీన్స్ ఏమీ లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది.కొన్ని విపరీతంగా ట్రోల్ అయిన షాట్స్ మాత్రం డిలీట్ చేశారు. ఆసక్తికరంగా... థియేటర్లలో చూడని వారు, ప్రభాస్ కోసం మళ్లీ చూసేవారు, ట్రోలింగ్ మెటీరియల్ కోసం ఎదురుచూసేవారు .. ఇలా అందరూ ఓటీటీ వైపు మొగ్గుచూపడంతో మొదటి రోజు సర్వర్లు స్లో అయినట్లు కూడా టాక్ వినిపించింది.
మారుతికే ఎందుకింత టార్గెటింగ్?
ఇటీవల కాలంలో ఏ దర్శకుడూ ఈ స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. 'ఆదిపురుష్', 'రాధేశ్యామ్' లాంటి సినిమాల దర్శకులకూ రాని స్థాయిలో మారుతిపై విమర్శలు వచ్చాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్తో సినిమా తీసుకుని కనీస బేసిక్ కేర్ కూడా తీసుకోలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్లలో డిజాస్టర్, ఓటీటీలో రోస్టింగ్ 'ది రాజాసాబ్' ప్రస్తుతం సోషల్ మీడియాలో పూర్తి స్థాయి ట్రోలింగ్ మెటీరియల్గా మారింది. సీన్ టు సీన్ స్క్రీన్ షాట్స్తో పోస్ట్మార్టం జరుగుతుండగా, మారుతి పేరు మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ ట్రోలింగ్ ఎంతవరకు కొనసాగుతుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











