అర్ధ రూపాయి కోసం కొట్టుకుంటారా.. థియేటర్ల ఇష్యూపై మెగా ప్రొడ్యూసర్ షాకింగ్ పోస్ట్
మల్టీప్లెక్స్లలో అమల్లో ఉన్న పర్సెంటేజ్ విధానాన్ని తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ అమలు చేయాలంటూ కొద్దిరోజుల క్రితం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఏకంగా జూన్ 1న బంద్ పాటించాలని అనధికారికంగా నిర్ణయాలు జరిగిపోయాయి కూడా. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. తాజాగా థియేటర్ల మూసివేత ఇష్యూపై పవన్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ సంచలన పోస్ట్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఆ నలుగురిపై ఆరోపణలు
థియేటర్ల బంద్ వ్యవహారం వెనుక చిత్ర పరిశ్రమను శాసిస్తున్న ఆ నలుగురు ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ధియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్ధను గుప్పిట్లో పెట్టుకున్న అగ్ర నిర్మాతలపై ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీలో కలకలం రేగింది. థియేటర్ల బంద్ వ్యవహారం పవన్ కళ్యాణ్కు ఆగ్రహం తెప్పించింది. దీని వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వాస్తవాలను వెలికి తీయాలంటూ ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించడంతో కథ అడ్డం తిరిగింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే థియేటర్ల బంద్ లేదని, ఇదంతా అసత్య ప్రచారమంటూ ఫిలిం ఛాంబర్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

దిల్రాజు, అరవింద్ వివరణ
పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకునేంత ధైర్యం ఎవరికీ లేదని అగ్ర నిర్మాతలు దిల్రాజు, అల్లు అరవింద్లు రోజుకొకరు చొప్పున మీడియా ముందుకొచ్చారు. తమకు ఉన్న థియేటర్ల సంఖ్యతో పాటు తమ చేతుల్లో ఏం లేదని స్పష్టం చేశారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఇండస్ట్రీ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై సినిమా టికెట్ల ధరలు సహా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ అంశంపై అయినా తనను వ్యక్తిగతంగా కలవడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఏం మాట్లాడాలన్? ఏం కావాలన్నా ఫిలిం ఛాంబర్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే థియేటర్లలో మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై తనిఖీలు నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
అనుశ్రీ సత్యనారాయణపై వేటు
ఇదే సమయంలో థియేటర్స్ బంద్ ప్రతిపాదన చేసింది జనసేన నేత, అనుశ్రీ సత్యనారాయణే అని దిల్ రాజు చెప్పడంతో ఆయనపై వేటు వేశారు పవన్ కళ్యాణ్. జనసేన ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర జనసేన ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించారు. దీంతో తనను బలి పశువును చేశారంటూ సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. నా దేవుడి సినిమాను నేను ఆపుతానా? అంటూ భావోద్వేగానికి గురయ్యారు. థియేటర్ల బంద్ ఆలోచన దిల్రాజు, ఆయన సోదరుడు శిరీష్ రెడ్డిదేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దలు, ప్రభుత్వ జోక్యంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది.
థియేటర్ల సమస్యపై బన్నీ వాసు ట్వీట్
తాజాగా అల్లు అరవింద్ మనిషిగా ముద్రపడ్డ నిర్మాత బన్నీ వాసు సంచలన పోస్ట్ పెట్టారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతలు చూసుకోవాల్సిందే పర్సంటేజీ విధానం కాదని ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు ఎలా రప్పించడానికి ఏం చేయాలన్న దానిపై ఆలోచించాలని సూచించారు. ఇప్పుడు జరుగుతున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావలా? నాది పావలా అని కొట్టుకోకుండా దానిని రూపాయికి ఎలా పెంచాలన్నది చూడాలని బన్నీ వాసు హితవు పలికారు. థియేటర్లో రిలీజైన 28 రోజుల్లోపే సినిమా ఓటీటీలోకి వస్తుందని, ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూతపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
మూడేళ్లకో సినిమా చేస్తే కష్టం
హీరోలు ఏడాదికో, మూడేళ్లకో ఓ సినిమా చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు దూరమైపోతారని వార్నింగ్ ఇచ్చారు బన్నీ వాసు. సింగిల్ స్క్రీన్స్ ఒకసారి మూసివేస్తే మల్టీప్లెక్స్ల వల్ల కేవలం 43 శాతం ఆదాయం మాత్రమే నిర్మాతకు చేరుతుందని.. ఈ విషయాన్ని హీరోలు గ్రహించాలని బన్నీ వాసు హెచ్చరించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి దీనిపై ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











