‘జూనియర్ ఎన్టీఆర్కి అలా దూరమయ్యా... తారక్ చుట్టూ ఉన్నవారి వల్లే’
భారతదేశంలో ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. నాటి కస్తూరి శివరామ్ నుంచి నేటి వెన్నెల కిషోర్ వరకు ఎందరో హాస్యనటులు.. తమదైన టైమింగ్, నటనతో ప్రేక్షకులను నవ్వించారు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. తమ పరిధి మేరకు హాస్యం పంచుతూ ప్రజల హృదయాలలో నిలిచిపోయారు. వీరిలో శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. హీరో ఫ్రెండ్గా, సహాయ పాత్రలలో మెప్పించిన ఆయన.. కమెడియన్గా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ హీరోలతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే జూనియర్ ఎన్టీఆర్తో బాగా క్లోజ్.. అలాంటిది ప్రస్తుతం వీరిద్దరి మధ్య అంతగా మాటల్లేవు.. దీని వెనుక కారణాలను శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఇష్టం సినిమాతో కమెడియన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ తర్వాత ఇడియట్, నాగా, సింహాద్రి, వెంకీ, 143, యమదొంగ, దేశముదురు, దుబాయ్ శీను, ఢీ, పరుగు, బ్లేడ్ బాబ్జీ, డార్లింగ్ తదితర చిత్రాలలో తన మార్క్ చూపించారు. పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల తదితర దర్శకులు శ్రీనివాస్ రెడ్డిని ప్రోత్సహించారు. రవితేజ సినిమాలలో ఖచ్చితంగా శ్రీనివాస్ రెడ్డి ఉండాల్సిందే. అంతలా తనదైన ముద్ర వేసిన ఆయన.. హీరోగా జయమ్ము నిశ్చయంబురా, గీతాంజలి తదితర సినిమాలలో నటించారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో శ్రీనివాస్ రెడ్డిది ప్రత్యేక అనుబంధం.. తారక్ నటించిన పలు చిత్రాల్లో ఆయన నటించారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఎన్టీఆర్ సినిమాలలో శ్రీనివాస్ రెడ్డి కనిపించడం లేదు.. అలాగే మాటలు కూడా తగ్గిపోయాయి. కొద్దినెలల క్రితం ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్తో స్నేహంపై శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటించకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆయనకు పెళ్లికావడం, నాకు పెళ్లికావడం.. నేను వేరే సినిమాలలో ఉండటం తదితర కారణాలతో చిన్న గ్యాప్ అయితే వచ్చింది. దానికి చుట్టుపక్కల క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి. మన ఆలోచనకి, మన డౌట్కి, మన సెంటిమెంట్ని రెచ్చగొట్టడం.. చుట్టూ ఉన్న వ్యక్తుల నుంచి వచ్చే మాట చెవిలో పడితే ఖచ్చితంగా ఆలోచనలో పడతాం. ఒకవేళ మనకి లేకపోయినా చుట్టుపక్కల వాళ్లు.. దానిని పెద్దది చేసి చెబుతారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ఎన్టీఆర్తో నాకు మంచి రిలేషన్ ఉండేది. ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు వాళ్లు వేసిన ప్లాన్ అద్భుతం. ప్రచారం గ్యాప్లో ఆయనకి ఎంటర్టైన్మెంట్లా మేము ఉండేవాళ్లం. మాట్లాడి అలిసిపోకుండా ఈ ఫ్రెండ్స్ .. ఒక్కో రోజున ఒక్కొక్కరం ఉండేవాళ్లం. ఫస్ట్ సెక్టార్లో రాజీవ్ కనకాల... దాని తర్వాత రాఘవ, సమీర్, రఘు వచ్చేవాళ్లు. మాట్లాడిన స్పీచ్ని టైప్ చేసి ప్రెస్కి పంపించే పనిని రఘు చూసుకునేవాడు. ఖమ్మంలోకి ఎన్టీఆర్ వచ్చాక నేను ఎంటరవుతానని చెప్పా. ఖమ్మంలో భారీ సభ జరిగింది... మొత్తం ఆ ప్రచారంలోనే ఖమ్మం టాప్ అని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.
పండక్కి గ్యాప్ ఉండటంతో కేరవాన్ని విజయవాడలో సర్వీసింగ్ పంపించారు. అందరం కార్లలో బయల్దేరాం. తారక్ గారి కారులో ఎక్కాలి.. ఎక్కమని ఎన్టీఆర్ పిలిచారు. అయితే ఆ సమయంలో నా బ్యాగ్ వెనుక కారులో ఉంది తెచ్చుకుంటానని వెళ్లేలోగా మరొకరు నా ప్లేస్లో ఎక్కడంతో ఆ కారు బయల్దేరింది. వెనుక కారులో ఎన్టీఆర్ను ఫాలో అవుతుండగా.. కొంచెం దూరంలో కారు కిందపడి ఉంది.. దిగి వెళ్తుంటే ఒళ్లంతా మట్టితో ఉన్న వ్యక్తితో ఎవరో మాట్లాడుతున్నారు. మేం కారులో చూస్తే అందులో తారక్ లేరు. చుట్టూ అంతా చూస్తుండగా.. ఆ మట్టి కొట్టుకుని గుర్తుపట్టని విధంగా ఉన్న మనిషే ఎన్టీఆర్. బ్లడ్ వస్తుండటంతో నా బ్యాగ్లో ఉన్న టవల్ చుట్టి కారులో బయల్దేరాం. సూర్యపేటలో మా పెద్దక్క ఉంటారు.. వెంటనే ఆవిడకి ఫోన్ చేసి ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్ అయ్యింది.. ఏ హాస్పిటల్కి వెళ్లాలని అడిగి కనుక్కున్నా. హుటాహుటిన సూర్యాపేట ఆసుపత్రి మొత్తాన్ని రౌండప్ చేసేశాం. పేషెంట్స్ని కాకుండా అందరినీ పక్కకు పంపించేశాం. తారక్ను చూడగానే డాక్టర్ చేతులు వణుకుతున్నాయి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి డైరెక్ట్గా కిమ్స్కు తీసుకొచ్చామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఆ ప్రాసెస్లో ఒకతను సరదాగా నవ్వుతూ .. నువ్వు అడుగుపెట్టావ్ యాక్సిడెంట్ అయ్యిందన్నాడు. ఆ మాటలతో బాడీ మొత్తం షేక్ అయ్యింది. ఆ మాటలతో తేరుకుని నేను ఉండబట్టే ప్రాణాలతో వచ్చారు.. నేను లేకపోతే ఏమయ్యేదో అని కౌంటర్ వేశా. ఆ మాటల్ని తారక్ గారి దగ్గరికి ఎవరైనా మరోలా మోసి ఉండొచ్చు. ఆ తర్వాత నేను ఎన్టీఆర్ గారిని కలిశాను.. లోకేషన్లో సరదాగా మాట్లాడుకున్నాం. ఫ్రెండ్షిప్లో ఎక్కడా తేడా రాలేదు కానీ.. నాతో మాత్రం బాండింగ్ మాత్రం తగ్గింది. ఈ చిన్న గ్యాప్ని నేను క్లియర్ చేసుకుంటా.. ఎందుకంటే తారక్ గారికి నేనంటే ఏంటో తెలుసు, రాజీవ్కి నేను ఇంకా బాగా తెలుసు. నా కూతురికి పేరు పెట్టడానికి ఆయనే సలహా ఇచ్చారు.. ఊయల ఫంక్షన్కి స్వయంగా వచ్చి ఆశీర్వదించారని శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications


















