వైఎస్ జగన్కు శిక్ష తప్పదు.. ఆ స్కామ్లు బయటపెట్టాననే .. థర్టీ ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు
స్టార్ కమెడియన్గా ఉన్న థర్ట్ ఇయర్స్ పృథ్వీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి వైసీపీలో చేరారు. జగన్ పాదయాత్రలో ఆయనతో పాటు నడవటమే కాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం చేశారు. పృథ్వీ సేవలను గుర్తించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కీలకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబీసీ) ఛైర్మన్గా చేశారు. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఎస్వీబీసీ మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడటంతో పాటు లైంగికంగా వేధింపులకు గురిచేశారంటూ ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పృథ్వీరాజ్.. ఎస్వీబీసీలోని మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించారని, వేతనాలు పెంచుతానంటూ వారిని లోబరచుకున్నారని కొందరు ఆరోపణలు సైతం చేశారు. అలాగే ఛైర్మన్ హోదాలో కొందరు ఉద్యోగులను ఇష్టానుసారం నియమించారని, డబ్బులు వసూలు చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఎం జగన్, అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీ తన పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో తెలుగు సినీ , రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తనను కావాలని కొందరు ఈ వివాదంలో ఇరికించారంటూ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైసీపీని వీడిన పృథ్వీ అనంతరకాలంలో జనసేనలో చేరి తాజా ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల తరపున ప్రచారం చేశారు. తాజాగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్నారు. తాను తప్పు చేయలేదని కావాలంటే కాణిపాకం ఆలయానికి వచ్చి ఒట్టు వేస్తానని, వాళ్లు వచ్చి ఒట్టు వేస్తారా అంటూ పృథ్వీ సవాల్ విసిరారు. తనకు ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి కావాలని ఎప్పుడూ జగన్ని అడగలేదని, కానీ వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా ఉంటే ఒక నమ్మినబంటుని ఎస్వీబీసీ ఛైర్మన్ను చేస్తే తిరుమలలో ఎలాంటి దుర్మార్గాలు జరిగినా కవర్ చేస్తాడన్న ప్లాన్తోనే తనకు బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.
కానీ తాను అలాంటి వ్యక్తిని కాదని.. నేనొచ్చాక ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నయో కనిపెట్టి ఫైల్ తీసుకెళ్లి జగన్ టేబుల్ మీద పెట్టానని పృథ్వీ చెప్పారు. అయితే దీనిపై సీఎం ఏదో ఆదేశాలు ఇచ్చారని.. కానీ అక్కడున్న వాళ్లు మాత్రం నువ్వు జగన్ చిన్నాన్న అని తెలియక సుబ్బారెడ్డిపై ఫిర్యాదు చేశావని, రెండు నెలలకు మించి పదవిలో ఉండవని హెచ్చరించారని ఆయన గుర్తుచేశారు.
కొందరు హెచ్చరించినట్టు, చెప్పినట్లుగానే కేవలం 4 నెలల్లోనే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి బయటకొచ్చేశానని పృథ్వీ తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని.. శ్రీవాణి ట్రస్ట్ అంటే ఏంటో చెప్పాలని , రేపు కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు, పవన్లు విచారణ చేయిస్తారని ఆయన హెచ్చరించారు.
ఒకప్పుడు తిరుమలకు వచ్చిన ప్రముఖులకు కప్పే శాలువా ఓ దుప్పటి మాదిరిగా ఉండేదని, కానీ వీళ్లు వచ్చాక అది కండువా సైజ్కి పడిపోయిందని పృథ్వీ సెటైర్లు వేశారు. తిరుమల లడ్డూని తీసుకుని బస్సుల్లో , విమానాల్లో ప్రయాణిస్తే దాని నుంచి అద్భుతమైన సువాసన వచ్చేదని .. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదన్నారు. వెంకటేశ్వరుడి ఆలయాన్ని నాశనం చేసేశారని, ఇందుకు 2024 ఎన్నికల్లో శిక్ష తప్పదని పృథ్వీ హెచ్చరించారు.
తిరుమలలో క్రైస్తవ మతాన్ని విస్తరింపజేశారని, చివరికి బ్రహ్మోత్సవాల్లోనూ అక్కడక్కడా క్రాస్ గుర్తులు కనిపించేవని తెలిపారు. ఇన్ని అరాచకాలు చేస్తే భగవంతుడు సైతం క్షమించడని పృథ్వీ హెచ్చరించారు. జగన్ని ఐదేళ్లు భరించారని, కొందరు బ్రాహ్మణులైతే ఆయనకు పిండ ప్రదానాలు కూడా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.


Click it and Unblock the Notifications











