తెలుగు చిత్రసీమలో మరో విషాదం: ప్రముఖ నటుడు బాలయ్య కన్నుమూత
కరోనా పుణ్యమా అని సినీ పరిశ్రమకు భారీ స్థాయిలో నష్టం ఏర్పడింది. అదే సమయంలో ఎంతో మంది ప్రముఖులను ఈ మహమ్మారి బలి తీసుకుని మరింత లోటును తెచ్చింది. అప్పటి నుంచి మరింత ఎక్కువగా తెలుగు సినీ ఇండస్ట్రీకి తరచూ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే సినీ రంగంలో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగులో ఇలాంటివి చాలానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టాలీవుడ్లో మరొక ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
చాలా ఏళ్ల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్గా విశిష్ట సేవలు అందించిన మన్నవ బాలయ్య (94) శనివారం తుది శ్వాసను విడిచారు. కొంత కాలంగా వృద్దాప్యానికి సంబంధించిన కారణాలతో బాధపడుతున్న ఆయన.. చాలా రోజులుగా మంచానికే పరిమితం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్లోని యూసుఫ్గూడాలో ఉన్న తన నివాసంలోనే ఉంటున్నారు. అయితే, శనివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో బాలయ్య తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

నటుడు, దర్శకుడు మన్నవ బాలయ్య మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పటికే ఆయన నివాసానికి చేరుకున్న చాలా మంది సినీ ప్రముఖులు మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారని సమాచారం. అప్పటి వరకూ ఆయన పార్థీవ దేహాన్ని బాలయ్య స్వగృహంలోనే ఉంచుతారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆయనకు ముగ్గురు సంతానం ఉన్నారు.
మన్నవ బాలయ్య 1930లో గుంటూరు జిల్లా చావపాడులో జన్మించారు. 1958లో వచ్చిన 'ఎత్తుకు పైఎత్తు' అనే సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆయన దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులోనే కాదు.. దక్షిణాదిలోని కొన్ని భాషల్లో కూడా ఆయన సినిమాలు చేశారు. చాలా సినిమాలకు గానూ ఆయన అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. అదే సమయంలో మన్నవ బాలయ్య దర్శకుడిగానూ పలు చిత్రాలను తెరకెక్కించారు. కృష్ణం రాజు, జయప్రధ ప్రధాన పాత్రల్లో 'నిజం చెబితే నేరమా' అనే సినిమాను తీశారు. ఆ తర్వాత 'పసుపు తాడు', 'పోలీస్ అల్లుడు' వంటి సినిమాలను కూడా రూపొందించారు.
నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటిన మన్నవ బాలయ్య కొన్ని చిత్రాలకు కథా రచయిత గానూ వ్యవహరించారు. 'చెల్లెలి కాపురం', 'నేరమూ శిక్ష', 'చుట్టాలున్నారు జాగ్రత్త', 'వాఫాదార్', 'పసుపు తాడు' వంటి సినిమాలకు కథలు ఇచ్చారు. అలాగే, నిర్మాతగానూ ఎన్నో సినిమాలు తీశారు. అందులో 'చెల్లెలి కాపురం', 'నేరము శిక్ష', 'చుట్టాలున్నారు జాగ్రత్త', 'ఊరికి ఇచ్చిన మాట', 'అన్నాదమ్ముల కథ', 'ప్రేమ పగ' వంటి సినిమాలు బాలయ్యకు బోలెడన్ని లాభాలను తెచ్చిపెట్టాయి.


Click it and Unblock the Notifications











