టాలీవుడ్లో వరుస విషాదాలు.. మరో యువ డైరెక్టర్ హఠాన్మరణం
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. నిన్న సాయంత్రం యువ దర్శకుడు ఒకరు కరోనా బారిన పడి ప్రాణం కోల్పోగా ఈ రోజు మరో దర్శకుడు హార్ట్ ఎటాక్ తో చనిపోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. నిజానికి నిన్న ఉదయం తమిళ స్టార్ దర్శకుడు కె.వి.ఆనంద్ కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన సినిమాలు తెలుగులో కూడా చాలా రిలీజ్ అయి ఉండడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితం, దీంతో తెలుగు సినీ పరిశ్రమ సైతం ఆయన మరణానికి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిన్న సాయంత్రానికి మరో దర్శకుడు వట్టి కుమార్ కరోనా కారణంగా మరణించారు.. అది జీర్ణించుకోకముందే మరో దర్శకుడు మృత్యువాత పడడంతో టాలీవుడ్లో విషాదం నెలకొంది.

మరో దర్శకుడు
టాలీవుడ్ దర్శకుడు శ్రవణ్ ఈ ఉదయం హఠాన్మరణం చెందారు అనే వార్త సంచలనంగా మారింది. శ్రవణ్ గతంలో వరుణ్ సందేశ్ హీరోగా తెరకెక్కిన ప్రియుడు అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించగా హీరోయిన్స్ గా అతిధి హీరోయిన్ అమృత రావు సోదరి ప్రీతికా రావు, కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ నటించారు. యూకే అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద ఈ సినిమాని ఉదయ్ కిరణ్ నిర్మించారు.. ఈ సినిమా ద్వారా పరిచయమైన శ్రవణ్ తర్వాత పెద్దగా సినిమా దర్శకత్వం అవకాశాలు దక్కించుకోలేకపోయారు.

ప్రస్తుతం కో డైరెక్టర్ గా
ఈ నేపథ్యంలోనే ఆయన పలు సినిమాలకు కో డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు. ఈ మధ్యకాలంలో శ్రవణ్ కళ్యాణ్ రామ్ హీరోగా రిలీజ్ అయిన MLA - ఎమ్మెల్యే మంచి లక్షణాలున్న అబ్బాయి, శ్రీ విష్ణు, ప్రియదర్శి, నివేదా థామస్, నివేదా పేతురాజ్, సత్యదేవ్ కీలక పాత్రలో నటించిన బ్రోచేవారెవరురా సినిమాలకి కో డైరెక్టర్ గా కూడా వ్యవహరించారు.. ఇక ఆయన ప్రస్తుతం మరికొన్ని సినిమాలకు కూడా పని చేస్తున్నారని తెలుస్తోంది.

నమ్మశక్యంగా లేదు
ఆయన మరణం గురించి ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఫేస్బుక్ ద్వారా స్పందించారు. నా మనసంతా నువ్వే , శ్రీరామ్ సినిమాలకి అసోసియేట్ గాను, మా ఇంట్లో పిల్లాడిలా మాతో కలిసిమెలిసి తిరిగిన మిత్రుడు శ్రవణ్ ఇక లేడంటే నమ్మశక్యంగా లేదు.. కథాచర్చల్లో ఎంతో సాయపడేవాడు.. చెదరని చిరునవ్వు, బోళ్లంత ఓపిక, చాలా సౌమ్యుడు.. వరుణ్ సందేశ్ హీరోగా "ప్రియుడు " సినిమాతో దర్శకుడయ్యారు'' అని ఆయన పేర్కొన్నారు.
Recommended Video

అర్ధంతరంగా మనని వదిలేసి వెళ్లిపోయాడు
''ఈ మధ్య చాలా కథా చర్చల్లో తరచు తారసపడ్డారు... ఇంతలోనే అర్ధంతరంగా మనని వదిలేసి వెళ్లిపోయాడు.. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం.. ఆయన ఆత్మకు సద్గతి లభించుగాక.'' అంటూ ఆయన తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇక కరోనా కారణంగా చాలా సినిమాలు షూటింగ్ వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికే థియేటర్లు సైతం మూత పడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇళ్ళలోనే ఉండాలని కూడా అందరినీ ప్రభుత్వాలు కోరుతున్నాయి. ఏదయినా పని ఉంటే తప్ప బయటకు రావద్దని కోరుతున్నాయి.


Click it and Unblock the Notifications











