Tejaswini Dil Raju : గుడ్ న్యూస్ చెప్పిన దిల్రాజు భార్య .. ఫోటోలు వైరల్
తెలుగు చిత్ర పరిశ్రమను కనుసైగతో శాసించగల కొందరిలో బడా ప్రొడ్యూసర్ దిల్రాజు కూడా ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్ధాలుగా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే స్టార్ ప్రొడ్యూసర్గా ఎదిగారు. చిత్ర పరిశ్రమలో నిర్మాత అనే వాడికి విలువ తగ్గుతున్న దశలో ఈ స్థానానికి గౌరవం తెచ్చిన వారిలో దిల్రాజు కూడా ఒకరు.
నిజామాబాద్ జిల్లాలోని నర్సింగపల్లి అనే మారుమూల గ్రామానికి చెందిన దిల్ రాజు అసలు పేరు వెంకట రమణా రెడ్డి. తొలుత తన సోదరులతో కలిసి ఆటోమొబైల్ వ్యాపారాన్ని నడిపించిన ఆయన తర్వాత 1990లలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ వైపు అడుగుపెట్టారు. జగపతిబాబు హీరోగా వచ్చిన పెళ్లి పందిరి సినిమాతో పంపిణీదారుడిగా మారారు. ఈ క్రమంలో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అన్న పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

2003లో వివి వినాయక్ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన దిల్ సినిమాతో నిర్మాతగా మారిన ఆయన.. తన మొదటి సినిమానే ఇంటి పేరుగా పెట్టుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై చాలా తక్కువ సమయంలోనే 50 సినిమాల వరకు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దిల్రాజు బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఖచ్చితంగా ఏదో ఒక విశేషం ఉంటుందని నమ్మి థియేటర్కు వచ్చే ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80 శాతం సక్సెస్ రేటు ఉదంటే దిల్రాజు జడ్జిమెంట్ను అర్ధం చేసుకోవచ్చు.
ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా పొంగల్ బరిలో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.
సత్య నారాయణ స్వామి వ్రతం చేస్తున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు #DilRaju #Tejaswini #SatyaNarayanaswamyVratham #TollywoodProducer #Filmibeattelugu pic.twitter.com/YSLFN1Nlrv
— TeluguFilmibeat (@TeluguFilmibeat) November 14, 2024
దిల్రాజుకు తొలుత అనితతో వివాహం జరిగింది. ఈ దంపతులకు హన్షితా రెడ్డి సంతానం. అయితే 2017లో గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. భార్య మరణంతో కృంగిపోయిన దిల్రాజు.. కుమార్తె, ఇతర పెద్దల ఒత్తిడి మేరకు 2020లో తేజస్వినిని పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు అన్వయ్ రెడ్డి జన్మించారు. తేజస్విని రాకతో తన జీవితం మలుపు తిరిగిందని దిల్రాజు చెబుతుంటారు.
భార్యతో కలిసి వెకేషన్కు , తీర్ధయాత్రలకు వెళ్తున్న దిల్రాజు ఎప్పటికప్పుడు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దిల్రాజు సతీమణి తేజస్వినితో కలిసి తమ నివాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే తేజస్విని ఇటీవల లా డిగ్రీని పూర్తి చేశారట. భర్త సహకారంతోనే తాను ఉన్నత విద్యను పూర్తి చేసినట్లుగా తేజస్విని తెలిపారు.


Click it and Unblock the Notifications











