Tollywood : చిక్కుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ .. ఆయనే ఉండి ఉంటే?
ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద సినీ పరిశ్రమ ఏది అంటే ఠక్కున వినిపించే పేరు టాలీవుడ్. బాహుబలికి ముందు వరకు బాలీవుడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించేది . కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో టాలీవుడ్ చేరింది. బాహుబలి సిరీస్, పుష్ప , కార్తీకేయ 2, కల్కి 2898 ఏడీ, హనుమాన్, ఇప్పుడు రీసెంట్గా పుష్ప 2 సినిమాలతో ఇండియన్ సినిమాను టాలీవుడ్ రూల్ చేస్తోంది. మిగిలిన ఇండస్ట్రీలలో కలెక్షన్లు రావడమే కష్టమైపోతే.. తెలుగు సినిమాలు అవలీలగా రూ.1000 కోట్లను క్రాస్ చేస్తుండటం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఈ విజయాలే కాదు.. వివాదాల్లోనూ టాలీవుడ్ దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సంఘటనలు వివాదాస్పదమయ్యాయి. హీరో రాజ్ తరుణ్ వ్యవహారం, జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు , బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ అరెస్ట్, మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు వీటన్నింటికి మించి టాలీవుడ్ స్టార్లలో ఒకరైన అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షాక్కు గురిచేసింది.

పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం తెలుగునాట ప్రకంపనలు సృష్టిస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత అల్లు అర్జున్ తన ఇంట్లో సినీ పెద్దలతో చేసిన బల ప్రదర్శన తెలంగాణ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించింది. దీనికి తోడు పోలీసుల సమర్ధతపై పలువురు కామెంట్ చేయడంతో డిపార్ట్మెంట్ మొత్తం టాలీవుడ్పై మండిపడుతోంది. ముందు మంచి సినిమాలు తీయండి, మీకెందుకు రాయితీలు కల్పించాలి అంటూ చిత్ర పరిశ్రమను ఇంటా బయటా ఏకీపారేస్తున్నారు.
అన్నింటికి మించి సంధ్య థియేటర్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి టాలీవుడ్ మొత్తానికి పాకింది. తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు స్పెషల్ షోలు, టికెట్ల పెంపుకు అనుమతించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కుండబద్ధలు కొట్టేశారు. అటు సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఇదే మాట మీదున్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ ఉద్యమం, ఇతర సందేశాత్మక చిత్రాలకే రాయితీలు, ప్రత్యేక అనుమతులు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు.
ఈ పరిణామాలు టాలీవుడ్కు షాకిచ్చాయి.. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని బడా సినిమాలు రిలీజ్ పెట్టుకుని స్పెషల్ షోలు, టికెట్ల రేట్ల పెంపు వంటి ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయి. ఇలాంటి దశలో అల్లు అర్జున్ వ్యవహారం వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పట్లో ముఖ్యమంత్రి ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు.. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే పెద్దల సాయంతో సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
టాలీవుడ్లో ఈ పరిణామాల నేపథ్యంలో దర్శకరత్న దాసరి నారాయణ రావు పేరు మారుమోగుతోంది. ఆయన చివరి శ్వాస వరకు తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కులా నిలిచారు. ఇండస్ట్రీకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ముందు నిలబడి పోరాడుతూ.. ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనేలా చొరవ చూపేవారు. కానీ దర్శకరత్న కన్నుమూసిన తర్వాత తెలుగు చిత్ర సీమకు పెద్ద దిక్కు లేకుండా పోయాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి ఆ పాత్ర పోషిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ను వ్యక్తిగతం కలిసి సమస్యను పరిష్కరించిన చిరంజీవినే ఇప్పుడు తాజా అల్లు అర్జున్ విషయంలోనూ కలగజేసుకోవాలని సినీ జనాలు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











