టాలీవుడ్లో మరో విషాదం: ప్రముఖ కో డైరెక్టర్ సత్యం కన్నుమూత.. పూజా హెగ్డే ఎమోషనల్ ట్వీట్
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. పలు కారణాలతో పరిశ్రమకు చెందిన చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది మరణిస్తున్నారు. ఇక, కరోనా వైరస్ ప్రభావం కారణంగా పలువురు అనారోగ్యానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. చాలా కాలంగా కో డైరెక్టర్గా పని చేస్తూ ఎన్నో సినిమాల్లో తెర వెనుక భాగం అయిన సత్యం శనివారం ఉదయం కరోనాతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన మరణంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. ఆ వివరాలు మీకోసం!

కరోనా బారిన పడ్డ కోడైరెక్టర్.. ఆస్పత్రిలో చేరిక
కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఈ మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ కోడైరెక్టర్ సత్యం కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స తీసుకుంటూ వచ్చారు.

పరిస్థితి విషమం.. తుది శ్యాస విడిచిన సత్యం
కొద్ది రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న సత్యంకు శనివారం ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలిసింది. వెంటనే ఆయనకు వైద్యులు మెరుగైన చికిత్సను అందించినప్పటికీ తుది శ్యాసను విడిచినట్లు తెలుస్తోంది. సత్యం మరణ వార్తతో టాలీవుడ్లోని ప్రముఖులంతా షాక్కు గురవుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.

ఆ ముగ్గురు డైరెక్టర్ దగ్గర.. వాళ్లతోనూ వర్కింగ్
సుదీర్ఘమైన కెరీర్లో కోడైరెక్టర్ సత్యం ఎన్నో సినిమాలకు పని చేశారు. మరీ ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, దర్శకధీరుడు రాజమౌళి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గర సహాయకుడిగా పని చేశారు. వాళ్లు తెరకెక్కించిన ఎన్నో భారీ హిట్ చిత్రాల్లో భాగం అయ్యారు. అదే సమయంలో శ్రీవాస్ తెరకెక్కించిన 'సాక్ష్యం' సహా మరికొన్ని చిత్రాలకూ వర్క్ చేశారు.

సత్యం మరణంతో షాక్.. పూజా హెగ్డే ఎమోషనల్
కోడైరెక్టర్ సత్యం మరణంతో సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఆయన గురించి ఓ ట్వీట్ చేసింది. 'మా కోడైరెక్టర్ సత్యం గారి మరణ వార్త విని షాక్కు గురయ్యాను. ఆయనతో అరవింద సమేత, సాక్ష్యం, అల.. వైకుంఠపురములో చిత్రాలు చేశాను. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నా' అంటూ ఎమోషనల్ అయింది.
Recommended Video

జెంటిల్మెన్.. గొప్ప వ్యక్తి.. అంటూ థమన్ ట్వీట్
సత్యం కన్నుమూసిన విషయం తనను షాక్కు గురి చేసిందని చెబుతూ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశాడు. 'పర్ఫెక్ట్ జెంటిల్మెన్, గొప్ప వ్యక్తి సత్యం గారి మరణ వార్త బాధాకరం. సెట్స్లో ఎంతో నిబద్ధతతో పని చేస్తారు. ఆర్టిస్టులకు ఫ్రెండ్లీగా నేరేషన్ చేస్తుంటారు. మిమ్మల్ని మేమంతా మిస్ అవుతున్నాం సార్. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











