34 ఏళ్లు వచ్చాయి.. ఇంకా దానిపై మోజు లేదు.. గీతా మాధురి
టాలీవుడ్లో ఉన్న స్టార్ సింగర్స్లో గీతా మాధురి కూడా ఒకరు. తన శ్రావ్యమైన గొంతుతో ఎన్నో హిట్ పాటలను పాడి సంగీత ప్రేక్షకులను అలరించారు గీత. గానంతో పాటు కంపోజింగ్, డబ్బింగ్ ఆర్టిస్ట్గానూ గీత రాణిస్తున్నారు. ఎందరో హీరోయిన్లు, ఇతర మహిళా నటులకు గీతా మాధురి గాత్రదానం చేశారు. ఇండస్ట్రీలోకి ఎంత మంది సింగర్స్ వచ్చినా.. గీతా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గీతా మాధురి కుటుంబం ఆమె తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడింది. నగరంలోనే బీకాం చదువుకున్న గీతా మాధురి .. తొలుత ప్రేమలేఖ రాశా అనే సినిమాలో గాయనీగా పాట పాడారు. అయితే 2007లో చిరుత చిత్రంలోని చమ్కా చమ్కా సాంగ్ ఆమెకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత మగధీరలో ధీర ధీర, గోలీమార్లోని మగాళ్లు ఒట్టి మాయగాళ్లు అనే పాటలతో గీత పేరు టాలీవుడ్లో మారుమోగింది.

20 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 2300కు పైగా పాటలు పాడారు గీతా మాధురి. నచ్చావులే, గుడ్ మార్నింగ్ సినిమాలకు నంది అవార్డ్స్.. నచ్చావులే, గోలీమార్, గుండెల్లో గోదావరి, బాహుబలి ది బిగినింగ్, మహానుభావుడు చిత్రాలకు ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నారు గీతా మాధురి. ఇవి కాక మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థల నుంచి అవార్డులు, రివార్డులను పొందారు ఈ స్టార్ సింగర్. ఇప్పటికీ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ సింగర్గా.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ పొందే సింగర్గానూ నిలిచారు.
ఇక యువ నటుడు నందూతో ప్రేమలో పడిన గీతా మాధురి పెద్దల అంగీకారంతో 2014లో ఆయనను పెళ్లాడింది. వీరికి 2019లో ఓ పాప పుట్టింది. నాటి నుంచి ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది ఈ జంట. నందూ సినిమాల్లో రాణిస్తుండగా.. గీతా మాధురి పాటలు పాడటంతో పాటు టెలివిజన్, ఓటీటీలోని పలు రియాలిటీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. సింగర్గా తన పాపులారిటీతో బిగ్బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్గా రాణించడంతో పాటు రన్నరప్గా నిలిచారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే గీతా మాధురి ఎప్పటికప్పుడు తన సినిమాలు , పాటలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు గీతా మాధురి. ఎంతో అందంగా ఉన్నారు? సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా అని యాంకర్ అడుగుతారు. తనకు ఇప్పటికే 34 ఏళ్లు వచ్చేశాయనని, ఆ ఉద్దేశం కూడా లేదని షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు గీతా మాధురి. మీరు వయసు చెప్పేస్తున్నారని యాంకర్ చెప్పడంతో.. చెబితే ఏమవుతుందని గీతా అన్నారు. ఏజ్ వస్తుందని అంతా భయపడుతున్నారని.. కానీ వయసు 16 ఏళ్ల వద్దే ఉండిపోయి, బుర్ర కూడా అక్కడే ఉండిపోతే తట్టుకోగలమా అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం గీతా మాధురి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











