Kota Srinivasa Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం .. నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుముశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. సుదీర్ఘ ప్రస్థానంలో ఆయన 750కి పైగా సినిమాలలో నటించారు. కోటా శ్రీనివాసరావు మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు.

కోట శ్రీనివాసరావు ప్రస్థానం:
10 జూలై 1942న కృష్ణాజిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాసరావు. ఆయన తండ్రి సీతారామాంజనేయులు డాక్టర్. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన కోటాకి తను కూడా డాక్టర్ కావాలని అనుకున్నాడు. అయితే చదువుకుంటున్న రోజుల్లో నాటకాలు వేస్తుండటంతో కోట శ్రీనివాసరావు మనసు నటన వైపు మళ్లింది. డిగ్రీ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. కోట శ్రీనివాసరావు భార్య రుక్మీణి.. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. రోడ్డు ప్రమాదంలో ఒక్కగానొక్క కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ప్రాణాలు కోల్పోవడంతో కోట బాగా కృంగిపోయారు. కోట శ్రీనివాసరావు తమ్ముడు కోట శంకర్ రావు కూడా నటుడే.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడే సినిమాలలో అవకాశాల కోసం ప్రయత్నించారు కోట శ్రీనివాసరావు. ఈ దశలో మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు(1978)లో ఓ చిన్న పాత్రలో ఆయన నటించారు. తర్వాత అమరజీవి, బాబాయ్ అబ్బాయ్, వందేమాతరం తదితర చిత్రాల్లో నటించినా అంతగా గుర్తింపు రాలేదు. ఈ దశలో ప్రతిఘటన చిత్రం ఆయనకు బ్రేక్ తీసుకొచ్చింది. శాంతి నివాసం, రేపటి పౌరులు, మండలాధీశుడు, యముడికి మొగుడు వంటి వరుస హిట్లతో కోట ఇక వెనుదిరిగి చూసుకోలేదు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా ఏ పాత్ర వేసినా పరకాయ ప్రవేశం చేసేవారు కోట.
47 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, దక్కనీ, మలయాళం చిత్రాల్లో దాదాపు 750కి పైగా సినిమాలలో నటించారు. ఆయనలో నటుడే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. తమిళ నటులు గౌండమణి, మణివన్నన్లకు తెలుగులో ఆయన గాత్రదానం చేశారు. ఇక కోట శ్రీనివాసరావు మంచి సింగర్ కూడా అక్కినేని అఖిల్ నటించిన సిసింద్రీలో ఓరీ నాయనో, గబ్బర్ సింగ్లో మందు బాబులం మేము మందు బాబులం పాటలు మాస్ను ఒక ఊపు ఊపాయి. సుధీర్ఘ కెరీర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 9 నంది అవార్డులు, ఒక సైమా అవార్డ్తో సినీరంగానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డ్తో సత్కరించింది.
రాజకీయాలపై తొలి నుంచి ఆసక్తిని కనబరిచిన కోట శ్రీనివాసరావు బీజేపీలో చేరి 1999 శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. తదనంతరం జరిగిన పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వయోభారంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు చివరిసారిగా సువర్ణ సుందరి సినిమాలో నటించారు. ఇటీవల బాగా చిక్కిపోయి.. షుగర్ కారణంగా ఆయన కాలి వేళ్లు కూడా తొలగించారు వైద్యులు. ఆ సమయంలో పలువురు సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాసరావు ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.


Click it and Unblock the Notifications











