పవన్ కల్యాణ్కు తీవ్ర విషాదం.. బర్త్డే వేడుకల్లో అపశృతి, ముగ్గురి మృతి.. ఓ బిడ్డగా నిలుస్తానంటూ.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకొన్నది. పవన్ జన్మదినం సందర్భంగా బ్యానర్లు కడుతున్న అభిమానులు ముగ్గురు మృత్యువాత పడగా, మరో నలుగురికి తీవ్రగాయాలైనట్టు సమాచారం. ఈ ఘటన చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని శాంతిపురం మండలం కనమలదొడ్డిలో చోటుచేసుకొన్నది. ఈ దుర్ఘటనతో స్థానికుల్లో విషాదం నిండుకొన్నది.
Recommended Video

బ్యానర్లు కడుతుండగా విషాదం
స్థానికులు, మీడియా వెల్లడించిన ప్రకారం.. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని ఏడవ మైల్ వద్ద కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు బ్యానర్లు కడుతున్నారు. ఈక్రమంలో విద్యుత్ షాక్ తగలడంతో శ్రీ సోమశేఖర్, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం అక్కడికక్కడే మరణించారు. గాయపడిన నలుగురిని కుప్పంలోని పిఈఎస్ మెడికల్ కాలేజ్కు తరలించారు. ఈ ఘటనపై చంద్రబాబుతోసహా స్థానిక నాయకులు స్పందించారు.

గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం
శాంతిపురం నాయకుల ఆదేశాల మేరకు స్థానిక నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించినట్టు సమాచారం. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ అధికారులను కోరినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసినట్టు సమాచారం. స్థానిక జనసేన నేతలు కూడా బాధితులను ఆదుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

గుండెల నిండా అభిమానం నింపుకొన్న
తన అభిమానులు అకాల మరణం చెందడంపై తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఓ సంతాప ప్రకటనను విడుదల చేశారు. నా పట్ల గుండెల నిండా అభిమానం నింపుకొన్న కుప్పం నియోజకవర్గ జనసైనికులు శ్రీ సోమశేఖర్, శ్రీ రాజేంద్ర, శ్రీ అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ తగలడంతో వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్థం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను అని పవన్ కల్యాణ్ ప్రకటనలో తెలిపారు.

తక్షణ సహాయం అందించాలని పవన్ కల్యాణ్ సూచన
నా అభిమానులు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మరో ముగ్గురు జన సైనికులు శ్రీ హరికృష్ణ, శ్రీ పవన్, శ్రీ సుబ్రహ్మణ్యం చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు తెలిపాను. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించాను అని పవన్ కల్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











