మంత్ర ముగ్దుల్ని చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి.. మీనాక్షి కల్యాణం నృత్యరూపకం అదుర్స్
కూచిపూడి నృత్యకారిణి, దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్యా శ్రీనివాస్, ఆమె బృందం హైదరాబాద్లోని శిల్పకళావేదికలోప్రదర్శించిన 'మీనాక్షి కల్యాణం' అనే నృత్య రూపకానికి ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మంత్రముగ్దుల్ని చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూపకాన్ని సమర్పించాయి. ఈ ఈవెంట్కు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, సీనియర్ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, నిర్మాతలు ఎస్. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, మామిడి హరికృష్ణ (తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్), సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత వసంతలక్ష్మి నరసింహాచారి, సంగీత దర్శకుడు తమన్ హాజరయ్యారు. అనిందిత మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు చుక్కపల్లి సురేష్, కె. సతీష్చంద్ర గుప్త తదితరులు పాల్గొన్నారు.
భమిడిపల్లి నరసింహమూర్తి రచించిన ఈ నృత్య రూపకానికి పేరుపొందిన నాట్యకారుడు పసుమర్తి రామలింగశాస్త్రి నృత్యాలు సమకూర్చగా, డీవీఎస్ శాస్త్రి సంగీతం అందించారు. మీనాక్షి, సుందరేశ్వరుల కల్యాణం వెనుక ఉన్న అద్భుతమైన గాథను ఈ రూపకం ద్వారా ప్రదర్శించారు. పార్వతిగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన భక్తురాలు విద్యావతికి పుట్టిన మీనాక్షిగా సౌజన్యా శ్రీనివాస్ ప్రదర్శించిన అభినయం, చేసిన నాట్యం ఆహూతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

సంప్రదాయం, సాంకేతిక నైపుణ్యం చక్కగా కలగలసిన ఆ ప్రదర్శనకు లైవ్ మ్యూజిక్, కాస్ట్యూమ్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ మరింత వన్నె తెచ్చాయి. గోపిక పూర్ణిమ, పసుమర్తి పద్మ అందించిన సుమధుర గాత్రం రూపకానికి అతికినట్లు సరిపోయింది. సుందరేశ్వరునిగా, మీనాక్షిగా జన్మించడానికి ముందు శివపార్వతులు చేసే నాట్యం చూస్తూ ఒకవైపు పరవశత్వానికీ, మరోవైపు భావోద్వేగానికీ లోనయ్యారు ప్రేక్షకులు.

మీనాక్షి ఒక యోధురాలిగా మారే వైనం, సుందరేశ్వరస్వామిని ఆమె పెళ్లాడే ఘట్టం చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపించింది. తమిళనాడుకు చెందిన పలు జానపద సంప్రదాయ రీతుల్లోని సౌందర్యాన్ని ప్రదర్శించడానికి వచ్చిన అవకాశాన్ని ఈ రూపకం చక్కగా ఉపయోగించుకుంది. మీనాక్షి కల్యాణం నృత్యరూపకం నయనానందకరంగా సాగింది. నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి దర్శకత్వంలో సౌజన్య కళాకారుల బృందం చక్కటి హావభావాలతో నృత్యం చేసి కళాప్రియులను మంత్రముగ్ధుల్ని చేశారు. మీనాక్షి పాత్రలో ఆమె అద్భుతమైన అభినయం చూపారు.

మామిడి హరికృష్ణ మాట్లాడుతూ, "సౌజన్యా శ్రీనివాస్ గారు, ఆమె బృందం ఇచ్చిన చిరస్మరణీయ ప్రదర్శన ఈ సాయంత్రం వేళ మనల్ని అందర్నీ పరవశింపజేసింది. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' నుంచి 'భీమ్లా నాయక్' దాకా తన చక్కని అభినయాలతో ప్రజానీకంలో యూత్ ఐకాన్గా పేరుపొందిన పవన్ కల్యాణ్ గారు మనమధ్య ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఒక రచయితగా, దర్శకునిగా త్రివిక్రమ్ గారికి ఉన్న పేరుప్రఖ్యాతులు మరెవరికీ లేవు. పసుమర్తి రామలింగశాస్త్రి గారి నృత్య దర్శకత్వం, ప్రత్యేకించి తమిళనాడుకు చెందిన సంస్కృతీ సంప్రదాయాలను ఆయన హైలైట్ చేసిన విధానం ఎంతైనా ప్రశంసనీయం" అన్నారు.
పసుమర్తి రామలింగశాస్త్రి మాట్లాడుతూ, "ఎన్నో ఏళ్లుగా నేను కూచిపూడి సంప్రదాయం మనుగడ గురించి ఆందోళన చెందుతూ వస్తున్నాను. పార్వతీదేవి లేదా ఆమె అవతారాల్లో ఒకదానిపై నృత్య రూపకం చెయ్యాలని అనుకుంటూ వచ్చాను. ఒకరోజు మధుర మీనాక్షిపై ప్రదర్శన ఇస్తే బాగుంటుందనిపించి, సౌజన్యతో మాట్లాడాను. కొవిడ్ -19 మా ప్లాన్స్ను అడ్డుకున్నప్పటికీ, ఈ రూపకాన్ని కలిసి తీసుకురావడంలో అవసరమైన సపోర్టును ఆమె అందించింది. వేదిక మీదకు పార్వతి రావడానికి చాలా సమయం పట్టిందనుకోండి. మీనాక్షి కల్యాణంతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేసిన సౌజన్యకూ, ఆమె బృందంలోని నృత్యకారిణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా" అని చెప్పారు.


Click it and Unblock the Notifications











