సౌందర్య సినిమాలో ఉదయ్ కిరణ్.. ఆ సీన్లు డిలీట్ , స్టార్ హీరో కనుసన్నల్లోనే!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాటి నుంచి నేటి వరకు ఎందరో హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. కానీ కొందరు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిలో సౌందర్య కూడా ఒకరు. మహానటి సావిత్రి తర్వాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సౌందర్య. అన్ని రకాల జోనర్స్లో నటించి దాదాపు 20 ఏళ్ల పాటు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా వెలుగొందారు . చిన్న వయసులోనే అకాల మరణం చెందిన సౌందర్య ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
దక్షిణాదిలోని అందరు అగ్రనటులతో కలిసి నటించిన అరుదైన ఘనత సౌందర్యది. స్క్రీన్ మీదే కాదు.. బయట కూడా మంచి మనసున్న వ్యక్తిగా సౌందర్యను ఇప్పటికీ చెప్పుకుంటారు. కర్ణాటకకు చెందిన అమ్మాయే అయినా తెలుగింటి మనిషైంది. కెరీర్లో పీక్స్లో ఉన్న దశలో పెళ్లి చేసుకున్న ఆమె మరెంతో ఎత్తుకు ఎదగాల్సింది . కానీ విధి ఆమెను చిన్న చూపు చూసింది. ఎన్నికల ప్రచారానికి వెళ్తూ 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య దుర్మరణం పాలయ్యారు. ఆమె మరణవార్త తెలుసుకున్న తెలుగు ప్రజలు, అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇక స్వయంకృషితో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగారు ఉదయ్ కిరణ్. చిత్రం, నువ్వునేను, మనసంతానువ్వే, కలుసుకోవాలని వంటి వరుస బ్లాక్బస్టర్స్తో లవర్ బాయ్గా యూత్కి ఫేవరెట్ హీరోగా నిలిచారు. అయితే ఆ సక్సెస్ను కంటిన్యూ చేయలేకపోయారు ఉదయ్ .. వరుస ఫ్లాపులతో కెరీర్ డైలమాలో పడింది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, ఆర్ధిక సమస్యలు ఇలా అన్ని ఒకేసారి చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరైన ఉదయ్ కిరణ్.. 2014 జనవరి 5న హైదరాబాద్లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడటంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.
సౌందర్యతో కలిసి నటించేందుకు మహేశ్, పవన్ వంటి స్టార్స్ సైతం పోటీపడ్డారు.. కానీ ఆ అవకాశం ఉదయ్ కిరణ్కు దక్కింది. అదే నర్తనశాల. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో సెట్స్పైకి వెళ్లిన ఈ సినిమాలో సౌందర్య ద్రౌపది క్యారెక్టర్లో ఉదయ్ కిరణ్ అభిమన్యుడిగా నటించారు. అప్పట్లో బాలయ్య దర్శకత్వం, భారీ స్టార్ క్యాస్టింగ్తో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సమయంలోనే సౌందర్య హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో నర్తనశాల ఆగిపోయింది.

ఈ సినిమాను షూట్ చేసినంత వరకు ఎడిట్ చేయగా 17 నిమిషాల ఫుటేజ్ వచ్చింది. 2020లో దేశాన్ని కరోనా వణికించిన సమయంలో నర్తనశాల ఫుటేజ్ రిలీజ్ చేయగా భారీ వ్యూస్ వచ్చాయి. అయితే ఈ సినిమాలో ఉదయ్ - సౌందర్యలపై కొన్ని సీన్లు చిత్రీకరించినప్పటికీ.. అప్పటికే ఉన్న ఫీడ్కి ఇవి సెట్ కాకపోవడంతో దర్శక నిర్మాతలు వాటిని తొలగించాలని నిర్ణయించినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ సినిమాలో నటించిన సౌందర్య, ఉదయ్ కిరణ్, శ్రీహరి, శరత్ బాబులు మరణించడంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కనపెట్టేశారు బాలయ్య. మధ్య మధ్యలో పలు గాసిప్స్ వినిపించినప్పటికీ అవి గాలి వార్తలుగానే నిలిచాయి.


Click it and Unblock the Notifications











