Ustaad Bhagat Singh Ticket Price: ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరలు పెంపు.. బెనిఫిట్ షో టికెట్ ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు సినిమా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సైతం సినిమా వాళ్లని నొప్పించకుండా ఎవరికి ఏం కావాలో అది చేసి పెడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు ఉండగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా అనుమతులు మంజూరు చేస్తోంది. తాజాగా పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్కి స్పెషల్ షోలు, టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్కు ప్రభుత్వం టికెట్ ధరలు ఎంత పెంచింది? ఎప్పటి వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయో పరిశీలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్లు దాదాపు 150 కోట్ల బడ్జెట్తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత మార్చి 26వ తేదీన రిలీజ్ను ఖరారు చేసుకున్న ఈ చిత్రం అనూహ్య పరిణామాల మధ్య ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఉస్తాద్ టికెట్ ధరల పెంపుకు ఏపీ సర్కార్ అనుమతి
ఇదిలాఉండగా.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు, టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మార్చి 19వ తేది తెల్లవారుజామున 4 - 5 గంటల మధ్యలో బెనిఫిట్ షో ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతించింది. అలాగే బెనిఫిట్ షో టికెట్ ధరను 500 రూపాయలు (పన్నులతో కలిపి)గా నిర్ణయించారు. అలాగే సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 125 రూపాయలు చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించింది. మార్చి 19 నుంచి మార్చి 28 వరకు పదిరోజుల పాటు పెంచిన టికెట్ ధరలు అమల్లో ఉంటాయని ఆదేశాలలో పేర్కొంది.
సుప్రీంను ఆశ్రయించిన మైత్రీ మూవీ మేకర్స్
ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్కు ఎలాంటి అడ్డంకులు లేకుండా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు అనుమతులు దొరకగా.. తెలంగాణలో పరిస్ధితి గందరగోళంగా ఉంది. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని సీరియస్గా తీసుకున్న న్యాయస్థానం.. ఏ సినిమాకైనా టికెట్ ధరలు పెంచాలంటే ప్రభుత్వానికి 90 రోజుల ముందు దరఖాస్తు చేయాలని నిబంధన విధించింది. దాంతో ఈ నిబంధనను సవాల్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
టికెట్ ధరల పెంపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు
దీనిపై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎఎస్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు విధించిన 90 రోజుల నిబంధనపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. టికెట్ ధరల పెంపుపై గతంలో ఉన్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీంతో తెలంగాణలోనూ ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ ధరలకు లైన్ క్లియర్ అయినట్లేనని అభిమానులు భావిస్తున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications

















