టాలీవుడ్లో మరో విషాదం: బాలయ్యకు హిట్లు ఇచ్చిన దర్శకుడు కన్నుమూత
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న చాలా సినీ పరిశ్రమల్లో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావంతో మరికొంత మంది చనిపోయారు. దీంతో రెండేళ్లుగా వరుసగా సినీ నటులు, టెక్నీషియన్లు ఇతర ప్రముఖుల మరణాలతో పరిశ్రమకు లోటును కలిగించే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టాలీవుడ్లో మరొక ప్రముఖులు ప్రాణాలు విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
సుదీర్ఘ కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, డైరెక్టర్గా విశిష్ట సేవలు అందించిన శరత్ కుమార్ శుక్రవారం తుది శ్వాసను విడిచారు. కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న శరత్ కుమార్.. ఇటీవలే అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, శుక్రవారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉదయం 9 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

దర్శకుడు శరత్ కుమార్ మరణ వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పటికే హాస్పటల్కు చేరుకున్న చాలా మంది సినీ ప్రముఖులు ఆయన మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నగరంలోని జూబ్లిహిల్స్ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అప్పటి వరకూ ఆయన పార్థీవ దేహాన్ని నగరంలోని స్వగృహంలోనే ఉంచుతారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దర్శకుడు శరత్ కుమార్కు వివాహం జరగలేదని తెలిసింది. దీంతో ఆయన హైదరాబాద్లో ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా దర్శకుడు శరత్ కుమార్ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు 'చాదస్తపు మొగుడు' సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ సినిమా 'డియర్' అనే నవల ఆధారంగా రూపొందింది. సుమన్ , భానుప్రియ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆయన దాదాపు 20 సినిమాలకు దర్శకత్వం వహించారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ, సుమన్తో శరత్ కుమార్ చాలా విజయవంతమైన సినిమాలను రూపొందించారు. తద్వారా స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు. అయితే, కొంత కాలంగా ఈ సీనియర్ డైరెక్టర్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో శరత్ కుమార్ దర్శకుడిగా చాలా సినిమాలు రూపొందించారు. అందులో నందమూరి బాలకృష్ణతో 'వంశానికొక్కడు', 'పెద్దన్నయ్య', 'సుల్తాన్', 'వంశోద్ధారకుడు', 'చాదస్తపు మొగుడు', 'పెద్దింటి అల్లుడు', 'బావ - బావమరిది', 'చిన్నల్లుడు', 'సూపర్ మొగుడు' వంటి చిత్రాలు పేరు తెచ్చిపెట్టాయి. మరీ ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా నటించిన 'సుల్తాన్'లో కృష్ణంరాజు, కృష్ణను కూడా నటింపజేసిన ఘనతను కూడా శరత్ కుమార్ సొంతం చేసుకున్నారు. తద్వారా తన పేరును ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











