Varanasi Movie: మహేశ్ బాబు వారణాసి రన్టైమ్, పార్ట్ 2 పై రాజమౌళి క్లారిటీ..
Varanasi Movie: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక సినిమాల్లో వారణాసి (Varanasi Movie) ఒకటిగా నిలుస్తోంది. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (S.S.Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులే కాదు... ఇండస్ట్రీ సెలబ్రిటీలు సైతం 'వారణాసి' విశేషాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మూవీ టీం ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సమయంలో డైరెక్టర్ రాజమౌళి కథ, మేకింగ్, రన్టైమ్తో పాటు భవిష్యత్ ప్లాన్స్పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే?
అత్యంత ప్రతిష్టాత్మక సినిమా వారణాసి కూడా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా సాగింది. దీనికి ప్రధాన కారణం రిలీజ్ డేట్ పోస్టర్పై కనిపించిన గ్లోబ్ ట్రాట్టర్ (Globe Trotter)ట్యాగ్, దీంతో వారణాసి- గ్లోబ్ ట్రాటర్ ఫస్ట్ పార్ట్, వారణాసి - టైమ్ ట్రాటర్ రెండో పార్ట్ అంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఈ వార్తలపై తాజాగా రాజమౌళి స్వయంగా స్పందిస్తూ పూర్తి క్లారిటీ ఇచ్చారు. హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వారణాసి సింగిల్ పార్ట్ ఫిల్మ్ అని స్పష్టం చేశారు. వారణాసి కథ పెద్దదిగా ఉండటంతో ఒక దశలో రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన వచ్చిందని, కానీ వెంటనే ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టామని తెలిపారు.

ప్రస్తుతం ఈ సినిమా ఒక్క పార్ట్గానే విడుదల కానుందని, రన్ టైమ్ సుమారు మూడు గంటలకు పైగా ఉంటుందని రాజమౌళి వెల్లడించారు. దీంతో 'వారణాసి 2' అనే ప్రచారానికి అధికారికంగా చెక్ పడినట్టైంది. ఇక ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోందని, మరో ఆరు-ఏడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నామని రాజమౌళి తెలిపారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. రాజమౌళి స్టైల్ ప్రమోషన్స్ అంటే సైలెంట్గా మొదలై, ఒక్కసారిగా గ్లోబల్ లెవల్లో బజ్ క్రియేట్ చేయడం తెలిసిందే.
వారణాసి లో మైథాలజీ టచ్ కీలకంగా ఉండబోతున్నట్లు జక్కన్న వెల్లడించారు. దాదాపు 25 నిమిషాల పాటు పురాణ నేపథ్యంతో సాగే సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. అలాగే ప్రతి సినిమాలో రామాయణం, మహాభారతాల స్ఫూర్తి ఉంటుందని, ఈ సినిమాలో మాత్రం రామాయణంలోని ఒక భాగాన్ని నేరుగా చూపించబోతున్నామని తెలిపారు. భారతీయ మూలాలు బలంగా ఉంటూనే, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కనెక్ట్ చేసే యూనివర్సల్ ఎమోషన్స్ ఈ కథలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
మహేష్ బాబు ఈ సినిమాలో 'రుద్ర' అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్. కొన్ని కీలక సన్నివేశాల్లో రాముడి ఛాయలు కనిపిస్తాయని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ చూస్తేనే- ఇదివరకు చూడని మహేష్ బాబును ప్రేక్షకులు చూడబోతున్నారన్న విషయం స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఇది మహేష్ - రాజమౌళి కాంబినేషన్లో తొలి సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమాను గ్లోబల్ రేంజ్లో నిలబెట్టే లక్ష్యంతో ప్రమోషన్లకే భారీగా ఖర్చు చేయనున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కేవలం ప్రమోషన్స్ కోసమే సుమారు రూ.200 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్లు టాక్. RRR తరహాలోనే ఈ సినిమాను కూడా అంతర్జాతీయ మార్కెట్లో దించాలని రాజమౌళి వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











