టాలీవుడ్లో మరో విషాదం: ‘వేదం’ నాగయ్య కన్నమూత.. భార్య మరణించిన కొద్ది రోజులకే ఇలా!
కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది మొత్తం కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమకు ఎంతగానో నష్టాలు వచ్చాయి. అందే సమయంలో ఎంతో మంది కార్మికులు ఆకలితో అలమటించిపోయారు. అదే సమయంలో పలువురు నటీ నటులు, టెక్నీషియన్లు ప్రాణాలను కోల్పోయారు. ఇక, ఈ ఏడాది ప్రారంభంలోనూ కొందరు సినీ ప్రముఖులు మరణించారు. ఈ క్రమంలోనే తాజాగా సినీ కుటుంబంలో మరో విషాదం అలముకుంది. 'వేదం' సినిమాతో గుర్తింపు పొందిన నాగయ్య అనారోగ్యంతో కన్నమూశారు.
ఎన్నో సినిమాల్లో నేచురల్ యాక్టింగ్తో మంచి పేరును సంపాదించుకున్న నాగయ్య.. శనివారం ఉదయం కన్నమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోన్న ఆయన.. తన నివాసంలోనే తుది శ్వాసను విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య కూడా మరణించారు. అదే సమయంలో ఈ మధ్య సినిమా అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాగయ్య ఆరోగ్యం బాగా క్షిణించినట్లు తెలిసింది. దీంతో ఇటీవల ఆయన ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నారట. అయితే, శనివారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన కన్నమూశారని తెలుస్తోంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

గుంటూరు జిల్లాలోని నర్సరావు పేట దగ్గరలో ఉన్న దేసవరం గ్రామానికి చెందిన నాగయ్య వ్యవసాయం బాగోలేక హైదరాబాద్కు వలస వచ్చేశారు. అప్పటి నుంచి ఫిలిం నగర్లో ఆయన నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'వేదం' అనే సినిమాలో అవకాశాన్ని అందుకుని.. సహజసిద్ధమైన నటనతో మెప్పించారు. దీంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత 'ఏమాయ చేసావే', 'నాగవల్లి', 'ఒక్కడినే', 'స్టూడెంట్ సార్', 'రామయ్య వస్తావయ్యా', 'స్పైడర్' సహా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే, కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











