గూగుల్ను రిపేర్ చేయాలన్నా గురువే కావాలి.. పుస్తకావిష్కరణ వేడుకలో వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు
సంజయ్ కిషోర్ సేకరించి రచించి రూపకల్పన చేసిన 'స్వాతంత్రోద్యమం- తెలుగు సినిమా- ప్రముఖులు' పుస్తకావిష్కరణోత్సవం హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో అతిరధ మహారధుల సమక్షంలో శనివారం ఉదయం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతర ఆయన మాట్లాడుతూ తెలుగు భాష, సినిమాలు, ప్రస్తుత రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ..
నాకు ఆరోగ్యం సహకరించడం లేదు. నాకు వెన్నుముక నొప్పితో బాధపడుతున్నాను. అందుకే సభా సమయాన్ని చాలా తక్కువగా ఉండేలా చూడమని వేడుక నిర్వాహకులను అడిగాను. ప్రస్తుతం సభకు వచ్చే వారికి వినే ఓపిక కూడా తగ్గింది. అందుకే తక్కువగా మాట్లాడితే మంచిది అని తెలుసుకొన్నాను. విలువలు, జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి అని వెంకయ్య నాయుడు అన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ స్వాతంత్య్రం రాకముందు నుండి ఉన్నది. అందుకే ఈ పుస్తక రచయిత సంజయ్ కిశోర్ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించిన చక్కటి విశ్లేషణ చేశాడు. ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం. ఒకప్పుడు ఒక సభ నిర్వహిస్తున్నామంటే ఎక్కడెక్కడి నుండో ప్రజలు పాల్గొనేవారు అని వెంకయ్య నాయుడు అన్నారు.
ఇప్పుడు ఏ సభ అయినా నిర్వహిస్తే మూడు బీలు సమకూర్చాలి అంటున్నారు. మూడు బీ-లంటే బస్సు- బిరియాని-బాటిల్ ఈ మూడు ఉంటేనే సమావేశాలకు హాజరవుతున్నారు. ఇవన్నీ వింటుంటే మనదేశం ఎక్కడికిపోతుంది అని భాదేస్తుంది. గూగుల్ను రిపేర్ చేయాలన్నా గురువే కావాలి అంటూ గురువు గొప్పతనాన్ని గురించి ముచ్చటించారు. ఇటువంటి మంచి పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావటానికి సంజయ్ కిశోర్ని ప్రయత్నించమని కోరుతున్నా అని వెంకయ్య నాయుడు అన్నారు.
మన దేశాన్ని బ్రిటీష్ వాళ్లు దోచుకుపోయారు. వాళ్లు గొప్పవాళ్లని కీర్తిస్తున్నారు. బ్రిటీష్ వాళ్లు మన మనుషులను కూడా దోచుకుపోయారు. మన దేశం సంస్కృతి, సంప్రదాయాలు పుట్టినప్పుడు వాళ్లు పుట్టలేదు. స్వాతంత్రం రాకముందు భారత దేశ సంపద, జీడీపి ప్రపంచం దేశాలతో పోల్చుకొంటే మూడో వంతు ఉండేది. అలాంటి దేశాన్ని భావ దారిద్రం పీడిస్తున్నది. ఈ భావ దారిద్రం నుంచి విముక్తి పొందాలి. మాతృభాష, మాతృదేశం, స్వదేశం, స్వధర్మం లాంటి విషయాలను గుర్తు పెట్టుకొని ఆచరించాలి అని వెంకయ్య నాయుడు పిలుపు నిచ్చారు.
తెలుగు భాషను విస్మరించి మనకు తెలియని భాష కోసం పాకులాడుతున్నాం. అలాగని నేను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకిని కాను. అమ్మ భాషను నేర్చుకోవాలి, అమ్మ భాషను ప్రోత్సహించాలి. ఇంటిలో, వీధిలో, బడిలో, గుడిలో అమ్మ ఒడి నుంచి వచ్చిన భాషను ప్రోత్సాహించాలి. ఇంటి నుంచి మమ్మీ, డాడీ కల్చర్ను తొలగించాలి. మమ్మ, డాడీ, బేడీ, కేడీ అవసరమా? అమ్మ అంటే కడుపు నుంచి వస్తుంది. మమ్మీ అంటే మూతి నుంచి వస్తుంది అని సెటైర్లు వేశారు.
సొంత లాభం కొంత మానుకొని.. దేశం కోసం పాటుపాడాలని పెద్దలు చెప్పారు. మనం సంస్కృతిని గుర్తు చేసుకోవాలి. మన సంస్కృతి అంటే జీవన విధానం. సంస్కృతి అంటే మతం కాదు. ఎవరైనా ఏ మతాన్ని అభిమానించవచ్చు. ప్రపంచంలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడ లేదు. దేశాన్ని ప్రేమించడం అంటే.. ప్రజలను, తల్లిదండ్రులను, సర్వ ప్రాణులతో కలిసి జీవించడం, చీమకు చెక్కర పెట్టి, పాముకు పాలు పోసి.. చెట్టుకు బొట్టుపెట్టి, పశువులకు అన్నం పెట్టే జాతి మనది. ఈ సంస్కృతి నుంచి దూరంగా వెళ్తున్నాం అని వెంకయ్య నాయుడు అన్నారు.


Click it and Unblock the Notifications











