‘ఎన్టీఆర్, ప్రభాస్లతో చేయను.. దిష్టి బొమ్మలా కనిపిస్తున్నానా’
ఇప్పుడంటే తగ్గింది కానీ ఒక ఐదారేళ్ల వరకు తెలుగు సినిమా అంతా కామెడియన్లదే రాజ్యం అన్నట్లుగా నడిచేది. ఒకే సినిమాలో దాదాపు పది మంది వరకు హాస్యనటులు తమ నటనతో ప్రేక్షకుల్ని నవ్విచేంవారు. అయితే కరోనా తర్వాత నిర్మాణం, ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు రావడంతో రోటిన్ కమర్షియల్ ఫార్ములా నుంచి టాలీవుడ్ బయటకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో కామెడీ సినిమాలు బాగా తగ్గిపోయాయి. కమెడియన్ల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది.
ప్రస్తుత కమెడియన్లలో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు వెన్నెల కిషోర్. ఇప్పుడు ఆయన లేకుండా సినిమాలే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వెన్నెల కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమెడియన్లపై ఓ రకమైన చిన్న చూపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లను కిషోర్ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.

వెన్నెల చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ
అమెరికాలో చదువుకుని , సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎలాంటి చీకూ చింత లేని జీవితం గడుపుతున్నప్పటికీ ఆ లైఫ్ తనకు వద్దని సినిమాలపై ఆసక్తితో ఇండియా వచ్చేశారు వెన్నెల కిషోర్. విలక్షణ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన వెన్నెలలో ఖాదర్ భాషా అనే చిత్రంతో ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచి తన తొలి సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చేసుకున్నారు. డిఫరెంట్ మాడ్యులేషన్, మేనరిజం, కామెడీ టైమింగ్తో టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా జెండా పాతారు కిషోర్.
బ్రహ్మానందం తర్వాత అంతటి పేరు
దూకుడు, రచ్చ, దరువు, జులాయి, దేనికైనా రెడీ, రన్ రాజా రన్, అల్లుడు శీను, సన్నాఫ్ సత్యమూర్తి, సర్కారు వారి పాట, భీష్మ, జాతి రత్నాలు, ఎక్కడికిపోతావు చిన్నవాడా, అల వైకుంఠపురంలో, సీతారామం తదితర చిత్రాలు ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సైతం తన తర్వాత అంతటి నటుడు వెన్నెల కిషోరేనని చెప్పారంటే కిషోర్ ప్రతిభను అర్ధం చేసుకోవచ్చు.
ఆ దర్శకుడు సర్జరీ చేయించుకోమన్నాడు
ఈ ఏడాది ఇప్పటికే వెన్నెల కిషోర్ నటించిన గేమ్ ఛేంజర్, రామం రాఘవం, 14 డేస్ గర్ల్ఫ్రెండ్ ఇంట్లో, రాబిన్హుడ్ సినిమాలు విడుదలై మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా శ్రీవిష్ణుతో కలిసి నటించిన సింగిల్ చిత్రంలోనూ తన కామెడీతో నవ్వులు పూయించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా వెన్నెల కిషోర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దూకుడు తన నట జీవితాన్ని మలుపు తిప్పిందని, ఈ సినిమా సమయంలో బాగా లావుగా ఉండటంతో మహేశ్ బాబు పక్కన సెట్ కాననే ఉద్దేశంతో దర్శకుడు శ్రీనువైట్ల తనను లైపో సర్జరీ చేయించుకోమన్నారని కిషోర్ తెలిపారు. అయితే కొన్ని సీన్లు షూట్ చేసిన తర్వాత రషెష్ చూడగా అదే ఫిజిక్ కావాలని చెప్పారని ఆయన గుర్తుచేశారు.
దిష్టిబొమ్మలా ఉండలేను
అయితే స్టార్ హీరోల సినిమాలో నటించకపోవడంపై వెన్నెల కిషోర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ ఇమేజ్ మారిపోయిందన్నారు. అలాంటి స్టార్స్ పక్కన తనకు క్యారెక్టర్లు రాయడం కత్తి మీద సాము వంటిదన్న ఆయన వారి సినిమాల్లో నిలబడటం తప్పించి చేసేదేం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల పక్కన తాను నటించలేనని దర్శక నిర్మాతలకు వెన్నెల కిషోర్ హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











