శోభితా ధూళిపాళ, నాగచైతన్య వివాదం.. క్షమాపణలు చెప్పిన వేణుస్వామి!
వివాదాస్పద వ్యాఖ్యలు చూస్తూ నిత్యం మీడియాలో హైలెట్ అవుతున్న ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరై బహిరంగ క్షమాపణలు తెలిపారు. కొద్ది నెలల క్రితం తెలుగు హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభితా దూళిపాళ వివాహం చేసుకొన్న సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసి దుమారం సృష్టించారు. దాంతో ఆయన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉమెన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో కమిషన్ ముందు హజరవ్వడానికి నిరాకరించిన ఆయన ఎట్టకేలకు దిగి వచ్చారు. తాజాగా కోర్టు ఆదేశాలతో ఆయన మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
హీరో, హీరోయిన్లు నాగచైతన్య, శోభితా దూళిపాళ ఇద్దరు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొన్నారు. అయితే వీరి కుటుంబాలు సంతోషంతో సంబరాలు చేసుకొంటుండగా వేణుస్వామి మీడియాలో బాంబు పేల్చారు. సమంతతో మాదిరిగానే నాగచైతన్య కూడా శోభితతో విడాకులు తీసుకొంటారు అని కామెంట్ చేశారు. దాంతో ఆయన వ్యాఖ్యలతో అందరూ దిగ్బ్రాంతి చెందారు.

వేణుస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు ఫిలిం జర్నలిస్ట్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తీసుకొన్నారు.
అయితే హౌకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ.. కమిషన్ ముందు హాజరు కావాల్సిందేనని చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆదేశాలు జారీ చేశారు. దాంతో హైకోర్టు కూడా కమిషన్ విచారణకు హాజరు కావాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో మరోసారి ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో కమిషన్ కార్యాలయంలో విచారణకు మంగళవారం హాజరయ్యారు.

నాగచైతన్య, శోభిత వివాహం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలు సరికావు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటున్నాను. ఎవరి మనోభావాలను దెబ్బ తీసినట్టు భావిస్తే అందుకు క్షమాపణలు కోరుతున్నాను అని మహిళా కమిషన్ ముందు వేణుస్వామి వెల్లడించారు. అంతేకాకుండా లిఖిత పూర్వకంగా తన క్షమాపణ పత్రాన్ని కమిషన్ చైర్ పర్సన్కు అందజేశారు. ఈ సందర్భంగా భవిష్యత్లో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకొంటామని నేరెళ్ల శారద హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











