అదే నాకైతే జైలు.. ఉరిశిక్ష.. శివాజీ కామెంట్స్పై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు
Venu Swamy - Shivaji: తెలుగు ప్రజలకు, సినీ అభిమానులకు వేణు స్వామి (Venu Swamy) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ, సంచలన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే వేణు స్వామి... కాలక్రమేణా తానే ఓ సెలబ్రిటీగా మారిపోయారు. తాజాగా సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఆయన చేసిన షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.ఇంతకీ ఏమన్నారంటే?
ఇటీవల శివాజీ, 'దండోరా' సినిమా ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. కొంతమంది ఆ వ్యాఖ్యలను సమర్థించగా, మరికొందరు తీవ్రంగా ఖండించారు. ఈ వివాదంలో యాంకర్ అనసూయ ఎంట్రీ ఇవ్వడంతో అసలు అంశం పక్కకు వెళ్లి 'శివాజీ వర్సెస్ అనసూయ'గా మారిపోయింది. ఈ నేపథ్యంలో వేణు స్వామి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వేణు స్వామి మాట్లాడుతూ.. 'నేను శివాజీ లాగా మాట్లాడి ఉంటే నన్ను జైలులో వేసేవారు. మహిళా కమిషన్లు, స్వచ్ఛంద సంస్థలు నన్ను బతకనిచ్చేవి కావు. మీడియా ఛానల్స్ అయితే ఊరూరా టార్గెట్ చేసేవి. అవసరమైతే ఐక్యరాజ్యసమితిని కూడా ఇన్వాల్వ్ చేసేవారు. మరో 10 నిమిషాల్లో వేణు స్వామి పూర్తయ్యారు.. త్వరలో వేణుస్వామి అరెస్ట్ అంటూ బ్రేకింగ్ న్యూస్లు వేసేవారు, మీడియా ఛానల్స్ నన్ను టార్గెట్ చేసి ప్రైమ్ టైమ్ డిబేట్లు కూడా పెట్టేవి'అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక్క భార్యాభర్తల జాతకం చెప్పినందుకే తనపై ఎన్ని కేసులు, చర్చలు పెట్టారో గుర్తు చేస్తూ.. 'సీఎంలు, పీఎంలను టార్గెట్ చేసి కామెంట్లు చేసే వాళ్లను ఎవరు పట్టించుకోరు. కనీసం అమ్మాయిల భద్రత గురించి మాట్లాడరు. కానీ నాపై మాత్రం అతి చేశారు' అంటూ గతంలో జరిగిన నాగ చైతన్య-శోభిత వివాదాన్ని పరోక్షంగా ప్రస్తావించినట్టుగా వ్యాఖ్యలు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఉందా? అని అడిగితే.. 'నాకు అలాంటి ఆలోచన లేదు'అంటూ స్పష్టంగా చెప్పారు. తన ఆలోచన విధానాన్ని వివరిస్తూ.. 'మీకు సూపర్ స్టార్ హీరో కనిపిస్తాడు. నాకు మాత్రం సినిమా ఫెయిల్ అయిన తర్వాత మూడు నెలలు ఇంట్లోనే కూర్చుని మందు తాగుతూ బయటకు రాని హీరో కనిపిస్తాడు. మీకు రేంజ్ రోవర్లో తిరిగే హీరోయిన్ కనిపిస్తుంది. నాకు మాత్రం సంపాదించిన డబ్బంతా కుటుంబానికి ఇచ్చి చివరకు రోడ్డుపై నిలబడి లోన్లు కట్టలేని హీరోయిన్ కనిపిస్తుంది'అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే రాజకీయ నాయకులపై కూడా తనదైన కోణంలో మాట్లాడారు. 'మీకు శత్రువులను చీల్చి చెండాడే నాయకుడు కనిపిస్తాడు. నాకు మాత్రం నాలుగేళ్ల తర్వాత జైలు వెళ్లే నాయకుడు కనిపిస్తాడు. మీ విధానం వేరు.. నా విధానం వేరు. నేను ప్రతి విషయాన్ని జాతక పరంగా ఆలోచిస్తాను' అని చెప్పారు. 'ఈరోజు తొడగట్టే వారందరూ రేపు బలి కావాల్సిందే. నాకు అమ్మవారి దీవెన ఉంది. ఆమె నన్ను కాపాడుతుంది. నాకు సంబంధించిన వరకు నేను కరెక్ట్ ఉన్నానా లేదా అంతే'అని స్పష్టం చేశారు.
ఇక యాంకర్ అనసూయ విషయానికి వస్తే.. ఆమె నిత్యం సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తుందని, అవి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంటే వాటిపై మాట్లాడే హక్కు తనకూ ఉందని చెప్పారు. 'ఇద్దరు సెలబ్రిటీలు మేము ఎంగేజ్మెంట్ చేసుకున్నామని పోస్ట్ చేస్తే దానిపై మాట్లాడితే తప్పేంటి? మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నాకు కూడా ఉన్నాయి. నేను కూడా భారతదేశంలోనే పుట్టాను. కానీ భారతదేశం వేరు, తెలుగు రాష్ట్రాలు వేరు. ఇక్కడ రెండు ప్లస్ రెండు ఐదు అవుతుంది'అంటూ సటైరికల్గా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి. శివాజీ గానీ, అనసూయ గానీ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో, ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











