వేణు ఊడుగులకు టీ కృష్ణ అవార్డు.. చిరంజీవి, రాఘవేంద్రరావు చేతుల మీదుగా!
తొలి చిత్రం నీది నాది ఒకే కథ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకొన్న వేణు ఊడుగులకు మరో అరుదైన గౌరవం దక్కింది. స్వర్గీయ దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన డైరెక్టర్స్ డే కార్యక్రమంలో ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు అవార్డుతో వేణు ఊడుగులను సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకులు ఎన్ శంకర్, కాశీ విశ్వనాథ్ చేతుల మీదుగా స్వర్గీయ టీ కృష్ణ మెమొరియల్ అవార్డును వేణు ఊడుగుల అందుకొన్నారు.
2018లో విడుదలైన నీది నాది ఒకే కథ చిత్రం ప్రేక్షకుల నీరాజనాలందుకొన్నది. సినీ విమర్శల ప్రశంసలు మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో పలు అవార్డులు కూడా దక్కాయి.

ఈ సందర్భంగా వేణు ఊడుగుల మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, కే రాఘవేంద్రరావు, ఎన్ శంకర్ చేతుల మీదుగా టీ కృష్ణ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా జన్మ ధన్యమైనట్టు భావిస్తున్నాను. నా తొలి చిత్రానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ దక్కడం నాపై మరింత బాధ్యతను పెట్టింది అని అన్నారు.
నీది నాది ఒకే కథ తర్వాత ప్రస్తుతం రానా దగ్గుబాటి, సాయిపల్లవితో విరాట పర్వం అనే సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానున్నది.


Click it and Unblock the Notifications











