Virosh: హాట్ టాపిక్గా రష్మిక ఫ్యామిలీ ఆచారాలు.. విజయ్ దేవరకొండతో అలా నరికిస్తారట!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్లో ఉదయ్పూర్లో జరగనుంది. ఇప్పటి వరకు ప్రేమికులుగా ఈ స్టార్ కపుల్.. మరికొద్దిగంటల్లో వైవాహిక బంధం ద్వారా దంపతులుగా మారనున్నారు. వీరి పెళ్లి కోసం అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. చాలా రోజుల తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరోయిన్, స్టార్ హీరో పెళ్లిపీటలు ఎక్కుతుండటంతో నేషనల్ మీడియా సైతం ఆసక్తికరంగా విజయ్- రష్మికలను వాచ్ చేస్తోంది. ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి అంశం క్షణాల్లో వైరల్గా మారుతోంది. తాజాగా విజయ్ - రష్మికల పెళ్లిపై ఓ కథనం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే...
గీతా గోవిందం సినిమా సమయంలో ప్రేమలో పడిన రష్మిక- విజయ్లు సీక్రెట్గా ప్రేమాయణం సాగించారు. కొన్నేళ్లుగా ఇద్దరి మధ్య వ్యవహారం నడుస్తున్నా, మీడియా కోడై కూస్తున్నా, సోషల్ మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నా.. ఇద్దరూ స్పందించలేదు. గతేడాది విజయ్ - రష్మికల ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ వీటిని ఇద్దరు ఖండించలేదు.. అలాగని స్పందించను లేదు. ఆ తర్వాత విజయ్ - రష్మికల పెళ్లి ఎక్కడ? ఎప్పుడు? అతిథులు ఎవరు అంటూ రకరకాల కథనాలు వచ్చాయి. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వీరి పెళ్లి జరుగుతుందని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈసారి ఏకంగా వెడ్డింగ్ కార్డ్ సైతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో విజయ్ - రష్మికలు స్పందించక తప్పలేదు.

ఫిబ్రవరి 26న రష్మికను పెళ్లాడబోతున్నట్లు విజయ్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. అలాగే అభిమానులు కోరుకున్న విధంగానే తమ పెళ్లికి వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నేళ్లుగా తమ ప్రయాణం భాగమైనందుకు, తమపై చూసిస్తున్న అభిమానానికి విజయ్- రష్మికలు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. పెళ్లి నేపథ్యంలో విజయ్ - రష్మికలతో పాటు ఇరు కుటుంబాలు, సన్నిహితులు, బంధులు ఉదయ్పూర్కు చేరుకున్నారు. నగరంలోని ఓ లగ్జరీ హోటల్లో అత్యంత రహస్యంగా జరుగుతున్న విజయ్- రష్మికల పెళ్లికి 100 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారట. పెళ్లి ఫోటోలు, వీడియోలు, ఇతరత్రా ఎలాంటి విషయాలు బయటకు రాకుండా విజయ్- రష్మికలు జాగ్రత్తలు తీసుకున్నారు. తమ జీవితంలోని అత్యంత కీలకమైన ఘట్టాన్ని తాము చిరస్మరణీయం చేసుకోవాలని అనుకుంటున్నామని.. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించొద్దంటూ వీరిద్దరూ మీడియాకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఫిబ్రవరి 24వ తేదీన అంగరంగ వైభవంగా సంగీత్ వేడుకలు జరగ్గా.. ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ - రష్మిక మందన్నల పెళ్లి జరగనుంది. అనంతరం హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో మార్చి 4వ తేదీన సినీ, రాజకీయ ఇతర ప్రముఖులు, సన్నిహితుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అయితే విజయ్ - రష్మికలు ఫిబ్రవరి 26వ తేదీన రెండు సార్లు, రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారని ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్- రష్మికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇద్దరిదీ హిందూ మతమే. అలాంటప్పుడు రెండుసార్లు, రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి ఎందుకు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
వీరిద్దరూ హిందూ మతానికి చెందినవారే అయినా.. ఒకే మతానికి చెందిన వేరు వేరు ప్రాంతాల వ్యక్తులు. అందుకే పెళ్లికి సంబంధించిన విధానాలు వేరుగా ఉంటాయి. విజయ్ తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు సాంప్రదాయం, ఆచార వ్యవహారాలను అనుసరించి ఒకసారి. రష్మిక కొడవ కమ్యూనిటీ వధువు కాబట్టి.. ఆ సాంప్రదాయం ప్రకారం మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారట. ఉదయం తెలుగింటి సాంప్రదాయంలో, సాయంత్రం కొడవ సాంప్రదాయంలో రష్మిక- విజయ్ల పెళ్లి జరగనుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొడవ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పెళ్లి క్రతువు ఎలా నిర్వహిస్తారు? అనేది ఆశ్చర్యకరంగా మారింది.
కర్ణాటకలోని కొడగు జిల్లాలోని విరాజ్పేట పట్టణం.. రష్మిక మందన్న స్వస్థలం. ఈ ప్రాంతంలో కోర్గి వర్గానికి చెందిన ప్రజలు తరతరాలుగా నివసిస్తున్నారు. కేరళ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో, పచ్చని కొండల మధ్య ఈ కొడగు జిల్లా విస్తరించి ఉంది. కోర్గి ప్రజలకు తమకంటూ ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. ద్రవిడ నాగరికత ప్రకారం వీరు యుద్ధవీరులు. రాజులు, రాజరికాలు అంతరించినా నాటి సంస్కృతిని వీరు విడిచిపెట్టరు. తమ పూర్వీకులు, కత్తులు, బాణాలు, ఇతర ఆయుధాలని దైవంలా పూజిస్తారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎలాంటి అనుమతులు, లైసెన్స్ లేకుండా తుపాకులు వెంట తీసుకెళ్లేందుకు అనుమతులున్న ఏకైక జాతి కొడవలు మాత్రమే.
ఇక కొడవ కమ్యూనిటీ పెళ్లి కూడా విభిన్నంగా ఉంటుంది. వీరి పెళ్లి తంతుని మంగళ అని పిలుస్తారు. మన హిందూ పెళ్లిలో మాదిరిగా పురోహితులు, అగ్నికుండం, ఏడాడుగులు వంటి కొడవ వైవాహిక సాంప్రదాయంలో ఉండవు. పూజా సామాగ్రి, మంగళ సూత్రానికి మాత్రం వీరు అమితమైన ప్రాధాన్యతను ఇస్తారు. పెళ్లిలోనూ ఆయుధాలను పూజిస్తారు. ముఖ్యంగా వరుడు ఓ కత్తిని ధరించి ఊరేగింపుగా వచ్చి.. పెళ్లి వేదిక వద్ద పాతిన అరటి బోదెలకు పూజ చేసి వాటిని అతనితో నరికిస్తారు. అలాగే హిందూ పెళ్లిళ్లలో మద్యం, మాంసానికి చోటు లేదు. కానీ కొడవ పెళ్లిలో మాంసం, మద్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. అది కూడా పంది మాంసం అయ్యుండాలి. తాము శుభకార్యాలు, ఇతర వేడుకల్లో పంది మాంసం తింటూ, వైన్ తాగుతామని పలుమార్లు రష్మిక తెలిపారు. పెళ్లి రోజున వధువు తమకు ఆనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం చీరను విభిన్నంగా ధరిస్తారు. వరుడు మాత్రం నలుపు రంగు కోటు, తలపాగా ధరిస్తాడు. వివాహం రోజున ప్రకృతిని, తమ పూర్వీకులను, కావేరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలా చేస్తే తమ పెద్దల ఆశీస్సులు లభించి.. వధూవరులు నిండు నూరేళ్లు అన్యోన్యంగా ఉంటారని కొడవ ప్రజల విశ్వాసం.


Click it and Unblock the Notifications











