VIROSH Wedding: విజయ్ దేవరకొండ, రష్మికకు ప్రధాని ఆశీస్సులు.. నరేంద్ర మోడీ ఊహించని సర్ప్రైజ్!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ దేవరకొండ - నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహం ఫిబ్రవరి 26వ తేదిన రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరగనుంది. టాలీవుడ్తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ చూపంతా ఇప్పుడు ఈ పెళ్లి గురించే ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీడియాకు, బయటి ప్రపంచానికి దూరంగా.. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరూ వివాహ బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. విజయ్ - రష్మికల పెళ్లి నేపథ్యంలో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ఉదయ్పూర్ చేరుకుంటున్నారు. కాగా విజయ్ - రష్మికలకు ఓ విశిష్ట అతిథి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ. ఈ వివరాల్లోకి వెళితే..
ఇప్పటి వరకు రహస్యంగా ప్రేమాయణం సాగించిన విజయ్ దేవరకొండ- రష్మికలు తమ పెళ్లిని కూడా అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చారు. అయితే ఆలస్యం చేయడం మంచిది కాదని భావించిన జంట.. పెళ్లికి రెండ్రోజుల ముందు బహిర్గతం చేశారు. రష్మికను తాను పెళ్లాడబోతున్నానని విజయ్ అధికారికంగా ప్రకటించారు. తాము చేయాల్సిన పనిని అభిమానులు ఎప్పుడూ ముందే చేస్తుంటారు. ఈసారి కూడా తమ పెళ్లికి విరోష్ అనే వారే పేరు పెట్టారు. అభిమానులు మా జీవితాల్లో ఒక భాగం.. వారిని గౌరవిస్తూ తమ వివాహ వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్లు విజయ్ ప్రకటించారు.

పెళ్లి నిమిత్తం విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలు హైదరాబాద్ నుంచి ఉదయ్పూర్ బయల్దేరి వెళ్లారు. ఎయిర్పోర్ట్లో వీరిద్దరి సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వీరితో పాటు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయ్పూర్ చేరుకున్నారు. నగరంలోని ది మెమొంటోస్ బై ఐటీసీ హోటల్స్ అనే లగ్జరీ హోటల్లో విజయ్ - రష్మికల పెళ్లి జరగనుంది. ఫిబ్రవరి 24వ తేదీన అంగరంగ వైభవంగా సంగీత్ వేడుకలు జరగ్గా.. ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన విజయ్ - రష్మిక మందన్నల పెళ్లి జరగనుంది. అనంతరం హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో మార్చి 4వ తేదీన సినీ, రాజకీయ ఇతర ప్రముఖులు, సన్నిహితుల కోసం భారీ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
కాగా... విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల వివాహాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోడీ విషెస్ తెలియజేశారు. విరోష్ పెళ్లి నేపథ్యంలో విజయ్ తల్లిదండ్రులు ప్రధాని మోడీకి వివాహ ఆహ్వాన పత్రికను పంపారు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ కొత్త జంటను ఆశీర్విస్తూ ప్రత్యేకంగా లేఖ పంపారు. శ్రీమతి మాధవి, శ్రీ గోవర్థన్ రావు దేవరకొండలకు... ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్ - రష్మికల వివాహానికి మీరు నన్ను ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఇది నిజంగా సంతోషకరమైన, శుభప్రదమైన క్షణాలు. ఈ సందర్భంగా దేవరకొండ, మందన్న కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు. ఇది విజయ్- రష్మికల జీవితాలలో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి నాంది. ఏడు అడుగులు కలిసిన వేసిన స్పూర్తితో ఈ జంట జీవితాంతం స్నేహితులుగా మారతారు అని మోడీ ఆకాంక్షించారు.
విజయ్- రష్మిక ఇద్దరూ తమ సినిమాల్లో స్క్రిప్ట్లకు కొత్త కాదు. కానీ ప్రేమ, ఆప్యాయతలతో నిండిన వారి నిజ జీవితాలలో దైవికంగా స్క్రిప్ట్ చేయబడిన ఈ అధ్యాయం, వెండితెరపై వారు సృష్టించిన మాయాజాలాన్ని ఖచ్చితంగా అధిగమిస్తుంది. వీరిద్దరూ రాబోయే రోజులు, నెలలు, సంవత్సరాలలో ఉమ్మడిగా తమ కలలు నెరవేర్చుకుంటారని.. ప్రేమతో బాధ్యతలను పంచుకుంటారు. ఒకరి బలాల నుండి ఒకరు నేర్చుకుంటూ.. నిజమైన భాగస్వాములుగా జీవితంలో ప్రయాణిస్తారని ఆకాంక్షిస్తున్నా. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నలకు వారి కుటుంబాలకు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ రాసుకొచ్చారు. ప్రస్తతుం మోడీ లేఖ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఏకంగా ప్రధాని నుంచి లేఖ రావడంతో విజయ్, రష్మిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విజయ్-రష్మిక జంటకు అరుదైన గౌరవం.. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ సందేశం..!!#PMModi #VijayDeverakonda #RashmikaMandanna #Rashmika #VIROSH #StarBuzz #Filmibeattelugu pic.twitter.com/nD5Hbv4JjW
— TeluguFilmibeat (@TeluguFilmibeat) February 25, 2026


Click it and Unblock the Notifications











