Vijay-Rashmika: విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నా అసహనం.. అలా చేయొద్దంటూ విజ్ఞప్తి..
Vijay-Rashmika: టాలీవుడ్లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారారు. వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్న వివాహానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 26న పెళ్లి జరగనుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్-రష్మిక అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఏమన్నారంటే..?
ప్రైవేట్ వేడుకగా పెళ్లి... లిమిటెడ్ గెస్టులతోనే
సమాచారం ప్రకారం.. ఈ నెల 26న రాజస్థాన్లోని ఉదయ్ పూర్ సిటీ ప్యాలెస్ లో విజయ్-రష్మిక వివాహం జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్గా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల మధ్యే నిర్వహించాలని జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్చి తొలి వారంలో హైదరాబాద్లో రిసెప్షన్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది.

ఇప్పటికే కొంతమంది అతిథులకు ఆహ్వాన పత్రికలు అందాయని, ఈ క్రమంలో కార్డు లీక్ కావడంతో పాటు వ్యక్తిగత నెంబర్లు బయటకు రావడం భద్రతాపరమైన ఆందోళనలకు దారి తీసిందని టీమ్ పేర్కొంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్న వేడుక కావడంతో ప్రతి అంశాన్ని గోప్యంగా ప్లాన్ చేస్తున్నామని, ఇలాంటి లీకులు ఏర్పాట్లపై ప్రభావం చూపుతాయని స్పష్టం చేసింది.
అయితే.. ఇటీవల సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్ కార్డు అంటూ ఓ ఇన్విటేషన్ వైరల్ కావడంతో పాటు, పెళ్లి - రిసెప్షన్కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చాయి. అందులో ముద్రించిన ఫోన్ నెంబర్లను సైతం కొందరు పబ్లిక్గా పోస్ట్ చేయడంతో... ఇది నేరుగా వారి ప్రైవసీకి భంగం కలిగించే చర్యగా విజయ్,రష్మిక టీమ్ అభివర్ణించింది.
'పెళ్లి అనేది వ్యక్తిగత విషయం' టీమ్ విజ్ఞప్తి
విజయ్-రష్మిక మేనేజ్మెంట్ విడుదల చేసిన ప్రకటనలో 'వివాహానికి సంబంధించిన ప్రైవేట్ సమాచారం సోషల్ మీడియాలో షేర్ చేయడం సరికాదు. ఇది అతిథులకు ఇబ్బందులు కలిగించే అవకాశముంది. పెళ్లి పూర్తిగా వ్యక్తిగత ఈవెంట్. దయచేసి వారి ప్రైవసీని గౌరవించండి' అని అభిమానులు, నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండగా, పెళ్లి సమయంలో ఫోన్లు వినియోగించొద్దని, ఫోటోలు-వీడియోలు తీయొద్దని కూడా అతిథులకు ముందుగానే తెలియజేశారట. వేడుకకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని బయటకు లీక్ చేయవద్దని స్పష్టమైన కండీషన్లు పెట్టినట్టు సమాచారం.
గీత గోవిందం నుంచీ పెళ్లి పీటల వరకూ
విజయ్-రష్మిక జంటగా గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో కలిసి జంటగా నటించారు. ఆన్స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్స్క్రీన్ స్నేహం కూడా క్రమంగా ప్రేమగా మారిందన్న వార్తలు కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఇద్దరూ ఎప్పుడూ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, వీరిద్దరూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే.. ఇటీవల విజయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెళ్లి పత్రిక ఇచ్చారన్న వార్తలు రావడంతో మ్యారేజ్ టాక్ మరింత హాట్ టాపిక్గా మారింది.
స్టార్ సెలబ్రిటీలైనా వారు కూడా సాధారణ మనుషులే. వారికి కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. అభిమాన ప్రేమ ఎంత గొప్పదైనా, ఆ ప్రేమలో పరిమితులు ఉండాలని సినీ వర్గాలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా యుగంలో ఏ సమాచారం అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. కానీ ప్రతి పోస్టు వెనుక బాధ్యత ఉండాలి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఊహాగానాలకు దూరంగా ఉండటం, విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నాల ప్రైవసీని గౌరవించడం నిజమైన అభిమానానికి గుర్తు అని వారి టీమ్ స్పష్టం చేస్తోంది.


Click it and Unblock the Notifications











