విజయ్ దేవరకొండపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన రణబాలి టీం..
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సక్సెస్ , ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా దూసుకవెళ్లున్నారు. ప్రస్తుతం రౌడీ జనార్థన, రణబాలి, శౌర్యువ్, వైరా బ్యానర్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీని బట్టే విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. నిర్మాతలు విజయ్ స్టార్ డమ్ ను, థియేటర్ పుల్లింగ్ క్రేజ్ నమ్ముతున్నారు. దర్శకులు తాము ఊహించుకున్న పాత్రలను విజయ్ సమర్థవంతంగా పోషించగలడని విశ్వసిస్తున్నారు. అయితే.. తాజాగా 'రణబాలి' విడుదలకు ముందే సోషల్ మీడియాలో అనూహ్యమైన వివాదం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది?
గత రెండు రోజులుగా విజయ్ దేవరకొండకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. షూటింగ్ సెట్స్లో నిర్మాతలకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ, అధిక సంఖ్యలో కారవాన్లు, అసిస్టెంట్లను డిమాండ్ చేస్తున్నారంటూ పలు సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై 'రణబాలి' చిత్రబృందం వెంటనే స్పందించి, అవన్నీ పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల ప్రకారం.. 'రణబాలి' షూటింగ్ సందర్భంగా విజయ్ దేవరకొండ ఏకంగా ఐదు నుంచి ఏడు కారవాన్లు కావాలని కోరారని, దాదాపు యాభై మందికి పైగా అసిస్టెంట్లతో షూటింగ్కు వస్తున్నారని, ఈ వ్యవహారంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు, ఈ విషయాన్ని నిర్మాతలు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లారని కూడా కొన్ని పోస్టులు పేర్కొన్నాయి. ఈ ప్రచారం కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ అభిమానుల్లో కూడా సందిగ్ధత నెలకొంది.
స్పందించిన విజయ్ టీమ్
ఈ వార్తలు వైరల్ కావడంతో విజయ్ దేవరకొండ టీమ్ వెంటనే అధికారిక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలు పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. విజయ్ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఇటువంటి అసత్య వార్తలను వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కూడా కోరినట్లు తెలిపింది.
నిర్మాత రవి శంకర్ క్లారిటీ
తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవి శంకర్ కూడా ఈ అంశంపై స్పందించారు. విజయ్పై వస్తున్న ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేస్తూ.. "అవి పూర్తిగా నిరాధారమైన వార్తలు. విజయ్ దేవరకొండ మోస్ట్ ప్రొఫెషనల్ యాక్టర్. షూటింగ్ సమయంలో మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఇలాంటి కథనాలను ఎవరు, ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు" అని స్పష్టం చేశారు. నిర్మాత చేసిన ఈ ప్రకటనతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లైంది.
సినీ వర్గాల్లో కూడా విజయ్ దేవరకొండ షూటింగ్ సమయంలో తన పనిపైనే పూర్తిగా దృష్టి పెడతారని, సమయపాలన విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారని చెబుతున్నారు. నిర్మాత రవి శంకర్ కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, విజయ్తో పనిచేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేయడం విశేషం.
ఇదిలా ఉంటే.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'రణబాలి'. ఈ సినిమా 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే దాదాపు తొంభై శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications





