స్తంభించిన టాలీవుడ్.. మహర్షి, కల్కి వేడుకలు రద్దు..
సినీ దిగ్గజం విజయ నిర్మల మరణంతో టాలీవుడ్ మూగబోయింది. గురువారం ఉదయమే ఆమె మరణ వార్త తెలియడంతో అన్ని కార్యక్రమాలను స్వచ్ఛందంగా వాయిదా వేసుకొన్నారు. విషాదంలో కూరుకుపోయిన సినీ ప్రముఖులు విజయ నిర్మల భౌతిక కాయానికి శ్రద్దాంజలి ఘటిస్తున్నారు.
శ్రీమతి విజయనిర్మల గారి మృతి పరిశ్రమకు తీరని లోటు. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఈ నెల 28న ప్లాన్ చేసిన మహర్షి 50 రోజుల వేడుకను కాన్సిల్ చేశాం అని మహర్షి యూనిట్ తెలియజేసింది.

ఇక గురువారం (జూన్ 27న) సాయంత్రం ఏర్పాటు చేసిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా రద్దు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. విజయ నిర్మల మృతికి ప్రగాడ సంతాపాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది.
మంచి మనసున్న మనిషి, బహుముఖ ప్రజ్ఞాశాలి, లెజెండ్ విజయనిర్మల గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆవిడ హఠాన్మరణాన్ని సంతాపంగా గురువారం సాయంత్రం నిర్వహించాలననుకున్న మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశామని కల్కి టీమ్ తెలిపింది.
రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో శివాని శివాత్మిక, వైట్ లాంబ్ పిక్చర్స్ వినోద్ కుమార్ సమర్పణలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించిన సినిమా కల్కి. ప్రపంవ్యాప్తంగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ విడుదల చేస్తున్నారు.
శుక్రవారం (జూన్ 28న) విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ముందుగా బుధవారం సాయంత్రం నిర్వహించాలని నిర్ణయించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల గురువారం సాయంత్రానికి వాయిదా వేశారు. విజయనిర్మల గారి ఆకస్మిక మరణంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు.
అలాగే, విలక్షణ నటుడు సూర్యతో లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న కాప్పన్ సినిమా తెలుగు టైటిల్ విడుదల కార్యక్రమం శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ టైటిల్ రిలీజ్ కార్యక్రమాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేత చేయించాలని నిర్ణయించారు. అయితే ఆకస్మికంగా విజయ నిర్మల మరణంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
కాగా, విజయ నిర్మల గారి అంతిమ యాత్ర శుక్రవారం ఉదయం 8 గంటలకు నానక్రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని తన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరుగుతాయి అని కుటుంబ సభ్యులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications











