Sai Pallavi వివాదస్పద వ్యాఖ్యలపై విజయశాంతి ఫైర్.. దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా అంటూ..
కశ్మీర్ పండిట్లపై జరిగిన దాడులపై అలాగే గోసంరక్షకులపై ఒకే తరహాలో కామెంట్స్ చేస్తూ ఇటీవల సాయి పల్లవి ఇచ్చిన ఇంటర్వ్యూ తీవ్ర దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విరాటపర్వం సినిమాను అడ్డుకుంటాం అని పలు హిందూ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజీపీ నాయకురాలు విజయశాంతి కూడా తీవ్రంగా ఖండించారు. ఆ వివాదంపై ఆమె సోషల్ మీడియాలో ఈ విధంగా వివరణ ఇచ్చారు.

విజయశాంతి వివరణ
విరాటపర్వం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక వ్యత్యాసంపై వివరణ ఇచ్చిన సాయి పల్లవి కాశ్మీర్ పండిట్లపై జరిగిన దాడులను అలాగే గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను కూడా ఓకే తరహాలో పోల్చడం కరెక్ట్ కాదని విజయశాంతి ఆరోపించారు.

రెండు పోరాటాలు ఒకేలా ఎలా అవుతాయి
విజయశాంతి వివరణ ఇస్తూ.. కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని అలాగే గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం.. ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుందని అన్నారు.

పక్కన పెట్టడం మంచిదని..
ఇక డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? అని విజయశాంతి ప్రశ్నించారు. ఎవరైనా సరే అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిదని కూడా విజయశాంతి పేర్కొన్నారు.

ప్రశ్నించే సమాజంలో..
ఇక నేడు మనం మాట్లాడే ప్రతి మాటా క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతుందని.. ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నామని అన్నారు. అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో... సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి.. అని కూడా విజయశాంతి తెలియజేశారు.

సమస్యల్లోకి లాగినట్టు
ఏది ఏమైనా కూడా సాయి పల్లవి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని చెప్పిన విజయశాంతి.. ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం అందుతోందని కూడా అన్నారు.

సాయి పల్లవి మౌనం?
ఇక విరాటపర్వం సినిమా శుక్రవారం గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా టైటిల్ పై కూడా భజరంగ్ దళ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అలాగే సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాశారు. వెంటనే టైటిల్ మార్చాలని లేకుంటే సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని కూడా అన్నారు. ఇక ఇప్పటివరకు సాయి పల్లవి ఈ వివాదాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఒక మీడియా సమావేశంలో ఆమెను అడిగినప్పటికీ కూడా దానికి ఇది సమయం కాదని అన్నారు.


Click it and Unblock the Notifications











