Varanasi Movie Story: ఆ ఇద్దరి మధ్య యుద్ధమే వారణాసి.. స్టోరీ లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్!
Varanasi Movie Story: దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే రాజమౌళి సినిమాల వెనుక ఉన్న అసలు శక్తి ఆయన తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ( Vijayendra Prasad) అని ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు. కథలు అందించడం మాత్రమే కాకుండా, సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే విధంగా చిన్న చిన్న క్లూలు ఇవ్వడం కూడా విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకత.
ప్రస్తుతం రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ 'వారణాసి'పై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, క్యారెక్టర్ పోస్టర్లు సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీశాయి. అయితే సినిమా అసలు కథ ఏమిటి? ఇందులో రామాయణానికి ఉన్న సంబంధం ఎంత? అనే ప్రశ్నలకు మాత్రం మూవీ మేకర్స్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వలేదు. అలాంటి సమయంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

తాజాగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన ఓ ఫ్యాన్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ సమాధానాలు ఇచ్చారు ఆయన. అలాగే.. గతంలో 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. అప్పట్లో ఆయన "సినిమాలో ఉండే 30 నిమిషాల సీక్వెన్స్ ఇండియాను షేక్ చేస్తుంది" అని చెప్పడం పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే విషయంపై వివరణ ఇవ్వాలని అభిమానులు కోరగా, విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
'ఆ 30 నిమిషాల సీక్వెన్స్ మరేదో కాదు.. రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే మహా యుద్ధం. టైటిల్ గ్లింప్స్లో కుంభకర్ణుడు కనిపించాడు. అలాగే రాముడు కూడా కనిపించాడు. ఆంజనేయుడి తోక, దానిపై ప్రయాణించే రథం కూడా చూశారు కదా. నేను చెప్పింది ఆ ఎపిసోడ్ గురించే' అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఈ ఒక్క వ్యాఖ్యతోనే 'వారణాసి' కథలో రామాయణం కీలక పాత్ర పోషిస్తోందనే విషయం మరింత స్పష్టమైంది.
సైన్స్ ఫిక్షన్తో రామాయణం కలయిక?
ఇప్పటివరకు వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే 'వారణాసి' సాధారణ పౌరాణిక సినిమా మాత్రమే కాదు. ఇది టైమ్ ట్రావెల్, మైథాలజీ, అడ్వెంచర్, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న భారీ విజువల్ స్పెక్టాకిల్గా కనిపిస్తోంది. త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, భారతదేశం నుంచి ఆఫ్రికా, అంటార్కిటికా వంటి ప్రాంతాల వరకు కథ విస్తరించి ఉండవచ్చని గ్లింప్స్ ద్వారా ఇప్పటికే హింట్ ఇచ్చారు.
మహేష్ బాబు ఈ సినిమాలో 'రుద్ర' అనే పాత్రతో పాటు, రాముడి అవతారంలో కూడా కనిపించనున్నారని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. గతంలో రాజమౌళి కూడా మహేష్ను తొలిసారి రాముడి గెటప్లో చూసినప్పుడు తనకు గూస్బంప్స్ వచ్చాయని చెప్పడం విశేషం. 'మహేష్లో కృష్ణుడి ఆకర్షణ ఉంది. కానీ రాముడి ప్రశాంతత కూడా ఉంది' అంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి.
విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యల తర్వాత మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న 'కుంభ' పాత్రకు కుంభకర్ణుడితో సంబంధం ఉందా? అనే ప్రశ్న ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. టైటిల్ గ్లింప్స్లో కనిపించిన భారీ యోధుడి రూపం, ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కుంభకర్ణ యుద్ధం విషయాలు ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఇక హీరోయిన్గా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ శివభక్తుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.
'వారణాసి' సినిమాను దాదాపు రూ.1400 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్లు, అంతర్జాతీయ స్థాయి షూటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఇప్పటికే అంటార్కిటికాలో షూటింగ్ జరిపిన తొలి భారతీయ చిత్రంగా 'వారణాసి'ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్లు వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
ఇప్పటివరకు 'వారణాసి'పై ఉన్న ఆసక్తి ఒక ఎత్తు అయితే, విజయేంద్ర ప్రసాద్ తాజా వ్యాఖ్యల తర్వాత ఈ సినిమాపై ఏర్పడిన హైప్ మరో స్థాయికి చేరుకుంది. మహేష్ బాబు కెరీర్లోనే కాకుండా భారతీయ సినిమా చరిత్రలో కూడా గుర్తుండిపోయే సినిమాగా 'వారణాసి' నిలుస్తుందా లేదా అన్నది ఇప్పుడు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications







